దేశంలో అన్ని పార్టీల అధినేతలు తమ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. కానీ ఆ దిశానిర్దేశం ఒక్కోలా ఉంటుంది. అసలు దిశానిర్దేశం అంటే ఏమిటి? ఏవిధంగా ఉండాలి? అంటే నిర్వచనాలు, తాత్పర్యం చెప్పుకోవడం కంటే మూడు ఉదాహరణలు చెప్పుకుంటే సరిపోతుంది.
1. జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం: మావిగన్, రప్పారప్పా, క్రెడిట్ చోరీ వంటి మాటలు కలిపి వచ్చే ఎన్నికలలో మనమే తప్పకుండా అధికారంలోకి వస్తున్నామని చెప్తుంటారు.
2. కేసీఆర్ దిశానిర్దేశం: రేవంత్ రెడ్డిని తిట్టిపోసిన తర్వాత మనదే అత్యుత్తమైన ప్రభుత్వం, పాలన అని చెప్పుకుంటారు. కేసీఆర్ ఫామ్హౌసులో పడుకుంటూ నేతలు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని చెప్తారు. పని చేయనివారికి టికెట్స్ ఇవ్వనని హెచ్చరిస్తుంటారు. కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతూ పార్టీ నేతలు అహంకారంతో వ్యవహరించరాదని చెప్తారు. రేవంత్ పాలనతో ప్రజలు వేసారిపోయారు కనుక వారికి మనల్ని ఎన్నుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని నిర్మోహమాటంగా చెప్తారు.
3. చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం: పార్టీలో అందరూ క్రమశిక్షణతో ఉండాలి. నేను, పవన్ కళ్యాణ్ ఇద్దరం పరస్పరం గౌరవించుకుంటాము. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో కూడా సఖ్యతగా ఉంటాను. కూటమిలో నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఇదేవిధంగా పరస్పరం గౌరవించుకుంటూ కలిసికట్టుగా పనిచేయాలి.
పార్టీలో, ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరిగితే అప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగుతుంటాను. కనుక నేతలు, కార్యకర్తలు కూడా ఇదేవిధంగా తమ తమ స్థాయిలో లోపాలు సరిచేసుకొని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి.
మన ప్రవర్తన వలన కూటమి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, పార్టీలకి, రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదు. మన అందరి ఏకైక లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి. దీని కోసం మన ఇగోలు, పంతాలు, పట్టింపులు, కోపతాపాలు పక్కన పెట్టడం చాలా అవసరం.
మూడు పార్టీల అధినేతల దిశానిర్దేశం ఇంచుమించుగా ఎప్పుడూ ఇలాగే సాగుతుంటుంది. కానీ వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలలో పార్టీ, నాయకుల పనితీరుపై లోతైన విశ్లేషణ ఉండదు. తప్పులు గుర్తించి సరిచేసుకోవాలనే మాట వినపడదు.
మన మాట తీరు, వ్యవహార శైలి అన్నీ సక్రమంగానే ఉన్నాయని, మనం ఏ మార్గాన్న పయనిస్తే అదే సరైన మార్గమని, ఈవిధంగానే గమ్యం చేరుకోగలమని చెప్తుంటారు.




