ఏపీలో వైసీపీ, తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ సుమారు 6 నెలల వ్యవధిలో ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయాయి. రెండు పార్టీల ఓటమికి వాటి అధినేతలు జగన్, కేసీఆర్ అహంభావమే ప్రధాన కారణమని అందరికీ తెలుసు.
రెండు పార్టీలు ఓడిపోయిన తర్వాత అక్కడ కేసీఆర్ ఫామ్హౌస్ వదిలి బయటకు రావడం లేదు. ఇక్కడ జగన్ కూడా తాడేపల్లి ప్యాలస్ వదిలి బయటకు రావడం లేదు.
ఇద్దరూ 2025 సంక్రాంతి రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ అడపా దడపా బయటకు వచ్చి పోతున్నారు తప్ప ఇదివరకులా ప్రజల మద్యకు వచ్చి రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం లేదు.
రాజకీయాలలో ఇటువంటి స్వారూప్యతలు సర్వసాధారణమే కానీ వారి కేసుల విషయంలో కూడా స్వారూప్యత కనిపిస్తుండటం విశేషం.
జగన్, కేసీఆర్ ఇద్దరూ తమ రాజకీయ ప్రత్యర్ధులను చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించారు. అక్కడ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించగా, ఇక్కడ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేయించి అరెస్టులు చేయించారు.
అక్కడ కేసీఆర్ అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడితే, ఇక్కడ జగన్ మద్యం కుంభకోణం వంటి అనేక కేసులలో అవినీతికి పాల్పడ్డారు.
అవినీతిలో కూడా జగన్, కేసీఆర్ మద్య స్వారూప్యతలు ఉండటం కూడా సర్వ సాధారణ విషయమే అని సరిపెట్టుకున్నా, రెండు రాష్ట్రాలలో ఈ కేసులు మొదలై ఒకేసారి వేగం పుంజుకోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.
అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ మాజీ సిఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు జూన్ 6,7 తేదీలలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో బిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
ఇక్కడ ఏపీలో మద్యం కుంభకోణం కేసులో సూత్రధారులు, జగన్కు అత్యంత సన్నిహితులైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కసిరెడ్డి రాజ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తుండటతో వైసీపీ నేతలు సిఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతున్నారు.
ఒకవేళ ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావులని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేస్తే తమ పరిస్థితి ఏమిటని అక్కడ బిఆర్ఎస్ ఆందోళన చెందుతుంటే, ఇక్కడ మద్యం కుంభకోణం కేసులో జగన్ని అరెస్ట్ చేస్త తమ పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన, అభ్రతాభావంతో ఉన్నారు.
రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన విధానం, ఎన్నికలలో గెలుపోటములు, ఫామ్హౌస్, ప్యాలస్ రాజకీయాలలో మాత్రమే కాక ఈవిదంగా కేసులలో, చివరికి వాటి టైమింగ్లో ఇంతగా మ్యాచింగ్ అవుతుండటం చాలా ఆశ్చర్యమే కదా?కనుక జగన్, కేసీఆర్ ఇద్దరూ ఒకేసారి జైలుకి వెళితే 100 శాతం మ్యాచింగ్ అవుతుంది.




