వైసీపీ ఓటమితో తారుమారైన ఏపీ రాజకీయాలను తెలుగు ప్రజలు బాగా ఆసక్తిగా గమనిస్తున్నారు. నాడు కౌరవ సభగా ఉన్న అసెంబ్లీని నేడు గౌరవ సభగా మార్చి చూపించాం, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి పోరాడండి అంటూ కూటమి నేతలు చేస్తున్న సవాళ్లకు నేడు స్పందించిన జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్దమే అంటూ ప్రకటించారు.
దీనితో ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం మూడు పార్టీల మద్దతుదారులతో పాటుగా రెండు రాష్ట్రాల ప్రజలు కూడా బాగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత ఐదేళ్లు అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షం మీద వైసీపీ చేసిన నీచ రాజకీయాలు, చట్ట సభలలో ఆనాటి మంత్రులు వాడిన భాష ఇప్పటికి వైసీపీని వెంటాడుతుంది.
అయితే నాడు ప్రతిపక్షంలో ఉంటూ అసెంబ్లీలో ఎన్నో అవమానాలను భరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ముఖ్యమంత్రిగా, సభాధిపతిగా ప్రమోషన్ పొందారు. అలాగే రెండు చోట్ల ఓడిపోయావు, నువ్వు రాజకీయాలకు పనికి రావు, అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అంటూ అవమానించిన జనసేన అధినేత పవన్ నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జగన్ ను ఎదుర్కోపోతున్నారు.
ఇక అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు పై వైసీపీ అరాచకం, ఉప సభాధిపతి రఘురామా మీద జగన్ దుర్మార్గం అన్నింటికి మరో రెండు రోజులలో అధ్యక్షా…అంటూ జగన్ సమాధానం చెప్పబోతున్నారు. RRR తనకు జరిగిన అన్యాయం పై గత ఐదేళ్లుగా జగన్ మీద యుద్ధమే ప్రకటించారు. అయితే నాడు తనకి జరిగిన అవమానాయునికి బదులుగా అదే జగన్ తో అధ్యక్షా అని పిలిపించుకోవడం నిజంగా RRR సాధించిన విజయంగా చెప్పవచ్చు.
ఇలా గత ఐదేళ్ల వైసీపీ పాపాలు, జగన్ అరాచకాలు అన్ని కలిసి ఏపీ రాజకీయాలలో హీట్ పెంచాయి. అలాగే టీడీపీ, జనసేన క్యాడర్ కూడా ఏ దృశ్యాన్ని వీక్షించడానికి గత 8 నెలల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనితో జగన్ సహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యే లు అందరు కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే గా తమ నియోజకవర్గ ప్రతినిధులుగా చట్ట సభలలో అడుగుపెట్టనున్నారు. దీనితో జగన్ రాకతో ముఖ్యంగా ఆనంద పడేది మాత్రం RRR అనే చెప్పాలి.
బాబు…ముఖ్యమంత్రి, పవన్ ఉప ముఖ్యమంత్రి, పప్పు పప్పు అంటూ హేళన చేసిన లోకేష్ ఐటీ, విద్యా శాఖ మంత్రి, తన బాటకు ఎదురు చెప్పాడు అనే కారణంతో చావు అంచులదాకా తీసుకెళ్లిన RRR ఉపసభాపతి….అయితే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి.
అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, అనేదానికి ఇదే మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. నాడు 151 మంది ఎమ్మెల్యే ల బలంతో విర్రవీగిన వైసీపీ నేడు 11 కి పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసుకుంది. అలాగే నేడు 164 మంది ఎమ్మెల్యే ల తో అసెంబ్లీలో కూటమి చేయాల్సింది బలప్రదర్శన కాదు, నాటి ఐదేళ్ల వైసీపీ పాపాలకు బలమైన సాక్ష్యాలు.
అసెంబ్లీలో జగన్ టార్గెట్ గా కూటమి నేతలు వైసీపీ మీద విమర్శలకు దిగితే అదే కారణంతో జగన్ మరోమారు అసెంబ్లీని బహిష్కరించి ప్రజలలో సింపతీ రాజకీయానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాటికీ ఆస్కారం ఇవ్వకుండా హుందాగా సభను నిర్వహించి జగన్ నాయకత్వానికి బాబు నిబద్ధతకు వ్యత్యాసాన్ని కూటమి చూపించగలగాలి.
అలాగే జగన్ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు తీరు పై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దానికి తోడు వైసీపీ నేతల మీద ప్రభుత్వం పెడుతున్న కేసుల పై కూడా సభలో రచ్చకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేయవచ్చు. ఏదిఏమైనా అందరు కోరుకున్నట్టుగా జగన్ అసెంబ్లీకి రావడం మాత్రం ఏపీ రాజకీయాలలో ఒక మంచి పరిణామమనే చెప్పవచ్చు.




