జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో ఏనాడూ ప్రెస్మీట్ పెట్టిందీ లేదు.. మీడియా ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడిందీ లేదు. అంతా సకలశాఖా మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి చూసుకునేవారు.
అది వివేకా హత్యకేసు అయినా, టికెట్స్, పొత్తులు, మూడు రాజధానులు, విశాఖ రాజధాని, ఋషికొండ ప్యాలస్లు దేని గురించైనా ఆయనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఆయన కొడుకు సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియాని చూసుకునేవారు. కానీ వారి నిర్వాకం వల్లనే తనకు, పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని, ఎన్నికలలో ఓడిపోయామని భావించిన జగన్, వారిని పక్కన పెట్టేశారు.
అయితే ప్రెస్మీట్లు అలవాటులేని కారణంగా ఎప్పుడూ తడబడుతూనే ఉంటారు. లండన్ నుంచి తిరిగి వచ్చి ‘జగన్ 2.0’ ఆవిష్కరించేసిన తర్వాత, వరుసపెట్టి ప్రెస్మీట్లు పెట్టి విజయసాయి రెడ్డి, విలువలు, విశ్వసనీయత మొదలు శాసనసభ సమావేశాలకు హాజరవడం వరకు ప్రతీ అంశంపై టకటకా సమాధానాలు చెప్పేస్తున్నారు. కానీ ఆ ఊపులో ఒకటి చెప్పబోయి మరేదో మాట్లాడేస్తున్నారు.
“ఈసారైనా శాసనసభ సమావేశాలకు వస్తున్నారా?” అనే విలేఖరి ప్రశ్నకు “అసెంబ్లీ సమావేశాలను మనం బహిష్కరిస్తున్నామనే దానికంటే హైకోర్టు నోటీసుకి ఎందుకు స్పందించడం లేదని మీరు వెళ్ళి స్పీకర్ని అడగాలి,” అని జవాబు చెప్పారు.
“మీరు వెళ్ళకపోతే కనీసం మీ ఎమ్మెల్యేలనైనా శాసనసభకు పంపించి వారిచేత స్పీకర్ని నిలదీయవచ్చు కదా? అనే ప్రశ్నకు “మనం ప్రజలకు సరైన మెసేజ్ పంపిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం మేము మీడియా ద్వారా ప్రజలను నిజాలు తెలియజేస్తున్నాము. ఈ విషయంలో మేము చెప్పదలచుకున్నది ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళని సమాధానం చెప్పమనండి. ప్రజలను చైతన్య పరిచే పనిని మేము చాలా సమర్ధంగా చేస్తున్నాము కదా? ఇక శాసనసభకు వెళ్ళామా లేదా అక్కడ ఒకరినొకరు తిట్టుకున్నామా.. కొట్టుకున్నామా లేదా అనేది ముఖ్యం కాదు కదా?” అని జగన్ సమాధానం చెప్పారు.
ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తాను, తన ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లాల్సిన అవసరమే లేదని జగన్ చెప్పే శారు కనుక ఇదే కారణం చూపిస్తూ జగన్కి, 10 మంది ఎమ్మెల్యేలకి శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసినా ఆశ్చర్యం లేదు. శాసనసభకు రాదలుచుకోనప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు?రాజీనామా చేయాలని లేకుంటే నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేస్తామని ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు చెపుతున్నారు కూడా.
కనుక ఈవిదంగా మాట్లాడినందుకు ఒకవేళ నోటీసులు అందుకుంటే అప్పడు జగన్కి తప్పకుండా సజ్జల లేని లోటు తెలిసొస్తుందేమో?




