జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ, పోలీస్, ప్రభుత్వ వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. అధికారం కోల్పోయినా జగన్ తీరు మారలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
కనుక నేడు జగన్ గుంటూరు మిర్చీ యార్డు పర్యటనకి అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. పోలీస్ శాఖ కూడా అనుమతి నిరాకరించింది. అయినా జగన్ వేలాది మంది కార్యకర్తలను వెంటబెట్టుకొని ఊరేగింపుగా గుంటూరు మిర్చీ యార్డు పర్యటనకి వెళ్ళారు.
అంటే చట్టం, రాజ్యాంగం ప్రత్యర్ధులకే తప్ప తనకు వర్తించవని జగన్ భావిస్తున్నట్లున్నారు. తమకి ఇబ్బంది కలిగిస్తే పోలీస్ అధికారులను బట్టలూడదీసి కొడతామని జగన్ బెదిరించడాన్ని పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. కానీ అనుమతి లేకపోయినా భారీ ఊరేగింపుగా వచ్చిన జగన్ని పోలీసులు అడ్డుకోలేకపోయారు. అడ్డుకుంటే దాడులు జరిపి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ బ్యాచ్ ప్రచారం మొదలుపెట్టేస్తుందని పోలీసులు వెనకాడి ఉండవచ్చు.
జగన్ మిర్చీ యార్డు పర్యటన మిర్చీ రైతుల కష్టాలు తెలుసుకోవడానికా లేక బలప్రదర్శనకా అన్నట్లు సాగింది. అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న మిర్చీ యార్డులో మిర్చీ రైతుల కష్టాలను సిఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలతో కాలక్షేపం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రైతులు సచివాలయానికి కూతవేటు దూరంలోనే టెంట్లు వేసుకొని సుమారు 4 ఏళ్ళపాటు నిరసన దీక్షలు చేశారు. అప్పుడు వారిపై అక్రమ కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పించిన జగన్, వారు అరసవెల్లి పాదయాత్రకు బయలుదేరితే దారి పొడవునా వారిపై వైసీపీ కార్యకర్తల చేత దాడులు చేయిస్తూ, పోలీసులతో అడ్డగిస్తూ ముప్పతిప్పలు పెట్టించారు. ఆ వేధింపులు భరించలేక వారు మద్యలోనే పాదయాత్ర విరమించుకొని అమరావతి తిరిగి వెళ్ళిపోయారు. నాలుగేళ్ళపాటు అమరావతి రైతులను ఇంతగా వెంటాడి వేధించిన జగన్, ఇప్పుడు మిర్చీ రైతుల కోసం నిసిగ్గుగా మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం లేదా కూటమి ప్రభుత్వ వైఫ్యల్యాలపై జగన్ తప్పకుండా పోరాడవచ్చు. కానీ ఆ పేరుతో చట్టాలను ధిక్కరిస్తూ, పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తే, ప్రభుత్వం తప్పనిసరిగా ఆయనపై చర్యలు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే దీనిని ప్రభుత్వ బలహీనతగా భావించి జగన్, వైసీపీ నేతలు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది.




