రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు అవే నిర్ణయాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారిపోతాయి.
ఏపీ రాజధాని విషయంలో మాజీ సిఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరి కూడా ఆయనకు, వైసీపీకి అలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నట్టు కనిపిస్తోంది.
నేడు తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మరోసారి ‘మావిగన్’కే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు.
ఎందువల్ల అంటే, అమరావతి పేరుతో అధికార కూటమి భారీ అవినీతికి పాల్పడుతోందన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మావిగన్ లేదా అమరావతి ఏది కావాలో తేల్చుకోమని అడుగుతానన్నారు.
ఎన్నికలలో రాజధానిపై ప్రజాతీర్పు కోరుతానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ద్వారా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని జగన్ గట్టిగా చెప్పాలనుకున్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా ఆ మూడు ప్రాంతాల ప్రజల, రైతుల భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీయవచ్చని జగన్ భావిస్తున్నట్లున్నారు.
అయితే గతంలో మూడు రాజధానులు పేరుతో ఇలాంటి ఆలోచన చేసినప్పుడు ప్రజలు తమనే తిరస్కరించారనే విషయం జగన్మోహన్ రెడ్డి అప్పుడే మరిచిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఓ పక్క రాష్ట్ర ప్రజలు అందరూ గర్వపడేలా, ప్రజల ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రతిష్టకు ప్రతీకగా రాజధాని అమరావతి కళ్ళెదుట కనపడుతున్నప్పుడు, జగన్ మావిగన్ అంటే ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో తేలికగానే ఊహించుకోవచ్చు.
కనుక జగన్ మావిగన్కి కట్టుబడి ఉండటం లేదా ఉన్నట్లు చేసిన ఈ ప్రకటన కూటమి ప్రభుత్వానికి కలిసి వస్తుంది. అదే సమయంలో వైసీపీ పాలిట శాపంగా మారే అవకాశం కూడా ఉంది.
నేటికీ వైసీపీకి రాజధాని పట్ల నిశ్చితాభిప్రాయం లేకపోవడం, అభివృద్ధి కంటే సంక్షేమ పధకాలే రాష్ట్రానికి మేలన్నట్లు జగన్ మాటలు గమనిస్తున్న ప్రజలు, పెట్టుబడిదారులలో ఆందోళన కలిగించేవే.
ముఖ్యంగా ఎన్నికల సమయానికి అమరావతి నిర్మాణం చాలా వరకు పూర్తవుతుంది. ఆ దశలో ఉన్న అమరావతిని జగన్ పక్కన పెడతారనే ఆలోచనే ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.
కనుక జగన్ మావిగన్పై తన వైఖరికి కట్టుబడి ఉంటే చాలు, వచ్చే ఎన్నికలలో అదే తమని మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపిస్తుందని కూటమి ప్రభుత్వం ఆశపడితే తప్పులేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు అదే మంచిది. కనుక జగన్ మాట తప్పకుండా మావిగన్కే కట్టుబడి ఉండాలని కోరుకుందాము.




