‘ఇతరుల భార్యల గురించి తప్పుగా మాట్లాడకూడదు,’ అనే ఈ మాట విన్నప్పుడు ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది ఎవరు? అంటే మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డే. ఆయన సిఎంగా ఉన్నప్పుడు శాసనసభలో తన కంటే వయసులో, అనుభవంలో పెద్దవారైన చంద్రబాబు నాయుడుని ఎంతగా అవమానించారో అందరికీ తెలుసు.
అదే సభలో కొడాలి నాని, రోజా వంటి వారి ద్వారా నారా భువనేశ్వరి గురించి ఎంత అనుచితంగా మాట్లాడించారో ప్రజలందరికీ తెలుసు. అప్పుడు సభలో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకుంటే జగన్తో సహా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ముసిముసినవ్వులు నవ్వుతూ ఏవిధంగా పైశాచికానందం అనుభవించారో రాష్ట్ర ప్రజలందరూ కళ్ళారా చూశారు.
ఆ తర్వాత ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని పదేపదే మూడు పెళ్ళిళ్ళు, ముగ్గురు పెళ్ళాలు అంటూ స్వయంగా జగన్ ఎంతగా అవహేళన చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు.
నాడు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళ గురించి చాలా అనుచితంగా మాట్లాడి, మాట్లాడించిన జగన్మోహన్ రెడ్డే నేడు “ఇతరుల భార్యల గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆడవాళ్ళు చాలా బాధపడతారంటూ,” తాడేపల్లి ప్యాలస్లో సుద్దులు చెపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
అయితే ఆయన చెప్పే నీతులు పార్టీ క్యాడర్కి కాదు… ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణకి!
“అయన ఇతరుల భార్యల గురించి అలా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడే చెప్తున్నా… రేపు మేము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిన్ను తిప్పని పోలీస్ స్టేషన్ అంటూ ఉండదు,” అని జగన్ వేమూరి రాధాకృష్ణని హెచ్చరించారు.
అంటే ఇతరుల భార్యల గురించి తప్పుగా మాట్లాడితే తాను ఏం చేయబోతున్నానో జగన్ చెప్పారు. మరి సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఏం చేయాలిప్పుడు?




