ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, అమలు చేసిన పధకాలను తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరం లేదు.
అందువల్లే జగన్ నిర్ధాక్షిణ్యంగా అమరావతిని, దానిలో లక్షల కోట్లు విలువ చేసే భవనాలను పాడుబెట్టేశారు. పేదలకు కడుపు నిండా అన్నం పెదుతున్న అన్నా క్యాంటీన్లు మూసివేశారు. పోలవరం పనులకు రివర్స్ టెండరింగ్ పేరుతో బ్రేకులు వేసి నిలిపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగానో అవసరమైన చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పనులను అర్ధాంతరంగా నిలిపివేసిన జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాను అమలుచేసిన సంక్షేమ పధకాలను యధాతధంగా అమలుచేయడం లేదని తప్పు పడుతున్నారు.
తన పార్టీ ఓటు బ్యాంక్ బలోపేతం చేసుకునేందుకే జగన్ సృష్టించుకున్న వాలంటీర్లను, సిఎం చంద్రబాబు నాయుడు కొనసాగించకపోవడాన్ని తప్పు పడుతున్నారు.
తాను సృష్టించిన అద్భుతమైన ఎండీయూ వ్యవస్థని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైసీపీ సోషల్ మీడియాలో జగన్ ఫోటోతో విమర్శలు గుప్పించింది.
ఎన్నికలప్పుడు జగన్ అమలుచేరిన పధకాలన్నీ కొనసాగిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటిని కూడా రద్దు చేసేశారని వైసీపీ సోషల్ మీడియా విమర్శించింది.
2019 ఎన్నికల సమయంలో అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని జగన్ నమ్మబాలికారు. కానీ ఆ తర్వాత మూడు రాజధానులంటూ ఒక్కటీ ఏర్పాటు చేయకుండానే దిగిపోయారు. కనీసం రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పనులు కొనసాగించడానికి జగన్ ఇష్టపడలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఉండవల్లిలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రజావేదికని జగన్ నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు.
అవన్నీ మరిచిపోయినట్లు తాను ప్రారంభించిన పనులు, పధకాలను చంద్రబాబు నాయుడు కొనసాగించడం లేదని వైసీపీ వాదించడం సిగ్గుచేటు కదా?అయినా నేను చెప్పినట్లే ప్రతిపక్షాలు నడుచుకోవాలని, నేను చెప్పినట్లే కూటమి ప్రభుత్వం పనిచేయాలని జగన్ కోరుకోవడం అహంభావానికి, రాచరిక పోకడలకు నిదర్శనం కావా? ఆయన చెప్పినట్లు ప్రతిపక్షాలు, ప్రభుత్వం నడుచుకునే మాటైతే ఈ ఎన్నికలెందుకు? వేర్వేరు ప్రభుత్వాలెందుకు?




