టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఈ రెండు పార్టీల సీనియర్ నేతలు పదేపదే ఓ మాట చెపుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు, పోలీస్ అధికారులు అందరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, కాదని వైసీపి నేతల మెప్పు కోసం వారు చెప్పిన్నట్లు నడుచుకొంటే, భవిష్యత్లో వారందరూ కూడా చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని పదేపదే హెచ్చరిస్తున్నారు.
తాము అధికారంలోకి రాగానే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వైసీపి నేతలందరితో పాటు వారికి ఇప్పుడు సహకరిస్తున్న అధికారులందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని పదేపదే హెచ్చరిస్తున్నారు. అధికారుల ఉద్యోగాలకు భద్రత ఉంటుంది కనుక వారు వైసీపి నేతల ఒత్తిళ్ళకు తలొగ్గకుండా చట్టానికి లోబడి సక్రమంగా పనిచేయాలని హితవు పలుకుతున్నారు.
కానీ ప్రతిపక్ష నేతల ఈ హితోక్తులను అధికారులు ఎవరూ పట్టించుకొంటున్నట్లు లేదు. అందుకు వారి కారణాలు వారికి ఉండవచ్చు. కనుక ఒకవేళ ప్రభుత్వం మారి టిడిపి, జనసేన కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వారందరూ మూల్యం చెల్లించక తప్పదు. ఇదే విషయం నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పకనే చెప్పేశారు.
“చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన్నట్లు తనకు తెలీదని, ఈ అరెస్టులు, ఈ కేసులతో గానీ తనకు ఎటువంటి సంబందమూ లేదని తేల్చి చెప్పేశారు. అంటే ప్రతిపక్ష నేతలపై ఈ కేసులు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేయాలనే నిర్ణయాలు తీసుకొంటున్న అధికారులదే పూర్తి బాధ్యత అని జగన్ చెప్పేశారన్న మాట!
ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఇదే విషయం చెపుతూ, “అరెస్ట్ చెయ్యమని చెప్పినవాడు చేతులెత్తేసాడు… అరెస్ట్ చేసిన వారు బుక్కైపోతారు. దేవుడి స్క్రిప్ట్ అదిరిపోలా!” అంటూ ట్వీట్ చేశారు. నిజమే కదా?



