దివంగత రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం యువతని కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు గట్టిగా కృషి చెయాలని చెప్పేవారు.
ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పగటి కలలు కంటూనే ఉన్నారు. అవి నిజమవుతాయని ఆశ పడుతున్నారు. అయితే ప్రజలు మన వైపే ఉన్నారని పగటి కలలు కంటూ, తన పార్టీ నేతలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుండటమే నవ్వు తెప్పిస్తుంది.
చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ళ పాలనతో ప్రజలు వేసారిపోయారని, స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరిగితే ప్రజలు మనల్నే గెలిపిస్తారనే తన అభిప్రాయాలను, పార్టీ నేతలపై బలవంతంగా రుద్దుతున్నట్లనిపిస్తుంది.
ప్రజలు తలుచుకుంటే చంద్రబాబు నాయుడుని కాదని జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా? స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అలాగే వైసీపీని గెలిపిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి కానీ ‘చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వడు,’ అని చెప్పడం దేనికి? ఓ పక్క ప్రజలు మనవైపే ఉన్నారని చెప్పుకుంటూ మళ్ళీ ముందే ఓటమికి ఇలాంటి కుంటి సాకులు సిద్ధం చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పక్కన పెట్టి వాలంటీర్లతో కథ నడిపించిన జగన్మోహన్ రెడ్డి, ‘స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతీ కార్యకర్తకి.. మీ వెనుక మీ నాయకుడున్నాడనే నమ్మకం కలిగించాలని,’ పార్టీ నేతలకు హితబోధ చేయడం విచిత్రంగా అనిపిస్తుంది.
నాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ‘గ్రామాలలో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకు పంచాయితీ ఎన్నికలలో ఏకగ్రీవాలకు రూ.5 నుంచి 20 లక్షల వరకు ప్రభుత్వమే ప్రోత్సాహకాలు ప్రకటించింది.
ఆ విషయం మరిచినట్లు, ఈసారి ఏకగ్రీవాలు జరిగితే అది నేరమన్నట్లు, అలా జరిగిది ఆయా నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జ్లకు వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వమని జగన్ బెదిరిస్తున్నారు.
‘మనం సంక్షేమ పధకాలు ఇచ్చాము కానీ చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు కనుక ప్రజలు మనవైపే ఉన్నరనుకోవడం’ మరో పెద్ద భ్రమ.
ఒకవేళ అందుకు ప్రజలు వైసీపీ వైపే ఉండి ఉంటే, శాసనసభ ఎన్నికలలోనే మళ్ళీ గెలిపించాలి కదా? కానీ అంత దారుణంగా ఎందుకు ఓడించారు? అని జగన్ ఆలోచించుకోవాలి కదా?
అప్పుడే గెలిపించని ప్రజలు, రెండేళ్ళలో ఇంత అభివృద్ధి, ఇన్ని పరిశ్రమలు, ఇన్ని ఐటి కంపెనీలు తెచ్చి చూపిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని కాదని మనకెందుకు ఓట్లు వేస్తారు? అని ఆలోచించాలి కదా?
కానీ ప్రజలు మనవైపే ఉన్నారనే తన భ్రమని వైసీపీ నేతలపై కూడా బలవంతంగా రుద్దుతున్నారు. ఇదెలా ఉందంటే గంధం చక్కల మద్య వెదురు కర్రని పెడితే, వాటి వాసన వెదురు కర్రకి వస్తే అది గంధం కర్రే అని భావిస్తున్నట్లే ఉంది. జగన్ ఇలాంటి భ్రమల్లో ఉన్నంత కాలం కూటమి ప్రభుత్వానికి అదే శ్రీరామ రక్ష.





