మనకి టైం వస్తుంది…అప్పుడు వాళ్ళకి మనము సినిమా చూపిద్దాం, ఇంకో మూడేళ్లు కళ్ళు మూసుకోండి, కాలం యిట్టె గడిచిపోతుంది, ఈసారి జగన్ 2.0 చూస్తారు, వైసీపీ నేతలను ఇబ్బందిపెడుతున్న అధికారుల బట్టలూడదీస్తా, వారు హిమాలయాలకు వెళ్లినా, విదేశాలకు వెళ్లినా పట్టిలాక్కొస్తా, నా కాళ్ళ లో మరోసారి పాదయాత్ర చేసే సత్తువ ఉంది…ఈసారి అధికారం మనదే….,
గత కొద్దీ రోజులుగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తున్న ఆణిముత్యాలు ఇవే. అయితే జగన్ ఇవే విషయాలను అటు తిప్పి ఇటు తిప్పి పదేపదే పార్టీ క్యాడర్ పై ఎందుకు అంతలా రుద్దుతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, అసలు విషయం అవగతం అవుతుంది.
గత వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా కేసుల రూపంలో బయటకొస్తున్నాయి. జగన్ ను నమ్మి చట్టాన్ని అతిక్రమించిన అధికారులు, జగన్ ఆదేశానుసారం రాజకీయ హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ నేతలు, జగన్ ప్రోద్భలంతో స్కాములతో అడ్డంగా దొరికిన జగన్ శ్రోయోభిలాషులు ఇలా ఎంతోమంది జగన్ పడగ నీడలో కేసులలో చిక్కుకుని జైళ్లలో మగ్గుతున్నారు.
అయితే వారికి ఈ దుస్థితి రావడానికి ఒకరకంగా పరోక్ష కారణం వైస్ జగనే. ప్రజలు తనకు, తన పార్టీకి టైం ఇచ్చినప్పుడు ఇలా అవినీతి, అక్రమాలు అంటూ తనను నమ్మిన వారిని నట్టేట ముంచిన ఈ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ నీలి ఛాయలు తనపై తన పార్టీ పై ప్రభావాన్ని చూపకూడదు అనే ఉద్దేశంతోనే పార్టీ క్యాడర్ ను రెచ్చకొడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు తాడేపల్లి ప్యాలస్ కు పరిమితమైన ఈ పెద్ద మనిషి ఇప్పుడు వైసీపీ ఓటమితో బెంగళూర్ ప్యాలస్ లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. అయితే 151 నుంచి వైసీపీ ఆమాంతం 11 కి పడిపోవడం, వైసీపీ నాయకులు ఒకొక్కరుగా అవినీతి కేసులలో అరెస్టవ్వడం, కొంతమంది నేతలు అరెస్టు భయంతో దేశాలు దాటి పోవడం,
మరికొంతమంది నేతలు కనీసం మీడియాకు కూడా ముఖం చూపించలేని దీన స్థితిలో ఉండడంతో పార్టీ క్యాడర్ను ఉత్తేజ పరచడానికి జగన్ ఎంచుకున్న మార్గమే ఈ బెదిరింపు రాజకీయాలు. 2029 లో జగన్ అనుకున్నట్టుగా ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ కు టైం వస్తుందేమో కానీ, వై నాట్ 175 కల మాదిరి అది కూడా జగన్ పగటి కలగా మారితే ఇప్పుడు జగన్ ను నమ్మి పరిధి దాటి ముందుకొచ్చే వైసీపీ నేతల పరిస్థితి ఏమవుతుంది.?
అటువంటి వారికి జగన్ నుంచి లభించే అభయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అరెస్టయ్యి జైల్లో ఊచలు లెక్కపెడుతున్న బోరుగడ్డ, వర్రా రవీంద్రా రెడ్డి, వల్లభనేని వంశీ, నందిగామ సురేష్ లాంటి వారిని చూస్తే యిట్టె అర్ధమవుతుంది. మరి ఇంత చూసిన తరువాత కూడా జగనన్న బెదిరింపు రాజకీయాలను నమ్మి వైసీపీ శ్రేణులు అడుగు ముందుకేస్తారా.? అలాగే జగన్ చెప్పినట్టుగా టైం వచ్చే వరకు డైరీలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తారా.?




