2024 ఎన్నికల ఓటమికి 2019 నాటి అధికారమే కారణమంటూ పరోక్షంగా ఒప్పుకున్నారు వైసీపీ అధినేత వైస్ జగన్. అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ 1.0 ని చూసారు. అప్పుడు అధికారంలోకి ఉండి కూడా కార్యకర్తలను పక్కన పెట్టాను, మీ పై ద్రుష్టి పెట్టకుండా ప్రజా ప్రయోజనాల మీదే శ్రద్ద పెట్టాను.
దాని ఫలితమే ఈ ఓటమి. ఈసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కార్యకర్తల కోసం పని చేసే జగన్ 2.0 ని మీరంతా చూడబోతున్నారు అంటూ పార్టీ కార్యకర్తలకు మరోసారి గేలం వేసే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అంటే అధికారం చేతికందగానే పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టి తప్పుచేసాను అంటూ జగన్ తప్పు ఒప్పుకున్నట్టేగా.!
అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది ఇప్పుడు గమనిద్దాం…,వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ గెలుపు కోసం కష్టపడిన క్యాడర్ కోసం జగన్ ఏకంగా ‘వాలంటీర్’ అనే ఒక ప్రభుత్వ అనుబంధ సంస్థనే సృష్టించారు. అందుకు గాను కొన్ని వేలకోట్ల ప్రజాధనాన్ని వెచ్చించారు. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఎటువంటి ప్రభుత్వ ప్రాధమిక నింబంధలను పాటించనప్పటికీ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే, ఒక ప్రజాప్రతినిధి కంటే పాలనలో బలమైన ముద్ర వేయగలిగింది.
అలాగే వైసీపీ ముఖ్య నేతలు సాయి రెడ్డి, అంబటి వంటి వారు వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే అంటూ బాహాటంగానే ప్రకటించేవారు, అంతే కాదు ఆ పార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులు సైతం మా కంటే కూడా మా నియోజకవర్గంలో వాలంటీర్ల పెత్తనమే ఎక్కువయ్యింది అంటూ నిట్టూర్చిన సందర్భాలు ఎన్నో మీడియాలో దర్శనమిచ్చాయి. ఇలా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీ కార్యకర్తల కోసం ఇంతలా శ్రమించిన జగన్ చివరికి ఘోర ఓటమిని చవిచూడక తప్పలేదు.
అయితే వైసీపీ గెలుపు కోసం తాపత్రయపడిన క్యాడర్ కోసం ఇంత చేసిన జగన్ మరి వైసీపీ గెలుపు కోసం, తన ముఖ్యమంత్రి పదవి కోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని పాదయాత్ర చేసిన చెల్లి షర్మిల కోసం కానీ అప్పటి వరకు ఎన్నడూ రాజకీయ వేదికల మీద కనిపించని తల్లి విజయలక్ష్మి సానుభూతి ప్రచారానికి కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక విలువనిచ్చారా.? అలాగే వారి కోసం ఏమైనా పదవిలిచ్చారా.? లేక వారిని కూడా రాజకీయంగా బలోపేతం చేయగలిగారా.? అంటే సమాధానం…
వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం, తల్లి, చెల్లి ఏపీ సరిహద్దులు దాటి పోవడం అన్ని అలా ఏడాదిలోపే చెకచెకా జరిగిపోయాయి. జగన్ మనసులో ఎంతటి ద్వేషం నిండక పొతే పార్టీ కష్టాలను ఎదుర్కొంటునప్పుడు, అలాగే తానూ ఆపదలో ఉన్నప్పుడు పార్టీ భుజం కాసి, జగన్ కు కుడి భుజమై ప్రత్యర్థి పార్టీలతో ఒక రాజకీయ యుద్ధమే చేసిన షర్మిలను పక్కన పెట్టారు.
అలాగే ఆరు పదుల వయస్సులో కూడా తల్లి విజయలక్ష్మి కొడుకు ఒక్క ఛాన్స్ కోసం అలుపెరుగని ప్రచారం చేసింది. దాని ఫలితం విశాఖ పట్నంలో తల్లి విజయలక్ష్మి ఓటమి, ఏపీ నుంచి షర్మిల తిరోగమనం. అలాగే వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుండి విజయమ్మ తొలగింపు. ఇక ఇక్కడితో అయినా తల్లి, చెల్లి మీద జగన్ ద్వేషం ఆగిందా అంటే జగన్ 2.0 ఎలా ఉంటుందో షర్మిల, విజయలక్ష్మి కి 2024 ఎన్నికల సమయంలోనే చూపించేసారు మన మాజీ ముఖ్యమంత్రి.
ఒక రాజకీయ ప్రత్యర్థిని దూషించే పదజాలం కన్నా తీవ్రమైన రూపంలో అటు షర్మిల పుట్టుక మీద, విజయలక్ష్మి ఆత్మ గౌరవం మీద సాక్షిలో కథనాలు, ఇటు అన్న జగన్ నుంచి అసభ్య పదజాలంతో వ్యక్తిగత ఆరోపణలు ఇవన్నీ కలిసి జగన్ వైఖరిని ప్రజలకు తెలియచెప్పాయి. దీనితో వైసీపీ నైతికంగా పతనమయ్యింది. అయితే షర్మిల మీద జగన్ ఏనాటి ద్వేషమో కానీ కనీసం ఇప్పటికైనా తల్లి, చెల్లి పట్ల తానూ కర్కశంగా ప్రవర్తించాను అంటూ ఒక మాట కూడా అనలేకపోతున్నారు.
పార్టీ క్యాడర్ కోసం తప్పు చేశాను అని ఒప్పుకున్న జగన్, తల్లి..చెల్లి కోసం తప్పొప్పుకోలేరా.? అంటే షర్మిల, విజయమ్మ ల మీద జగన్ కు కార్యకర్తల పాటి విలువ లేకుండా పోయిందా.?




