జగన్‌కు రక్షణ కవచం కావాలి… ఎక్కడ దొరుకుతుంది?

JAgan Modi

తెలంగాణతో పోలిస్తే ఏపీలో రాజకీయాలు కాస్త పారదర్శకంగానే ఉన్నట్లు చెప్పవచ్చు. ఎన్డీఏలో వైసీపి భాగస్వామి కానప్పటికీ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మోడీ, అమిత్ షాల పట్ల విధేయంగానే ఉండేవారు. అధికారం కోల్పోయిన తర్వాత మరింత విధేయంగా ఉంటున్నారు కూడా. ఎందుకో అందరికీ తెలుసు.

ADVERTISEMENT

అయితే బీజేపీ పెద్దలు టిడిపితో పొత్తు పెట్టుకునే ముందు చంద్రబాబు నాయుడు-జగన్‌లలో ఎవరితో చేతులు కలిపితే మంచిదని ఊగిసలాడారు.

తమకు ధీటుగా రాజకీయాలు చేయగల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపితే మంచిదా లేదా కేసులు, అప్పుల కోసం తమకు అణగిమణిగి ఉండేందుకు సిద్దంగా ఉన్న జగన్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చి మళ్ళీ గెలిపిస్తే మంచిదా?

టిడిపి, వైసీపిలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి?తాము ఎటువైపు మొగ్గితే ఎక్కువ లాభం ఉంటుంది? ఏ పార్టీతో కలిస్తే తమకు కేంద్రంలో ఎక్కువ మంది ఎంపీల మద్దతు లభిస్తుంది? అని లెక్కలు వేసుకున్నాకనే టిడిపి వైపే మొగ్గు చూపారని అందరికీ తెలుసు.

ఏ రాజకీయపార్టీ అయినా ఇటువంటి లెక్కలు వేసుకోవడం సహజమే కనుక బీజేపీని తప్పు పట్టలేము.

కానీ నేటికీ జగన్‌ బీజేపీ పెద్దలను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కారణాలు అందరికీ తెలుసు. నితీష్ కుమార్‌ బిహార్‌కు ప్రత్యేక హోదా పేరుతో మోడీ ప్రభుత్వానికి ‘అలారం సెట్’ చేశారు. కనుక ఇదే అదునుగా జగన్‌ మోడీ, అమిత్ షాల చంక నెక్కాలని ఆరాటపడుతున్నారు.

నితీష్ కుమార్‌ వలన తమ ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉన్నందున, మోడీకి కూడా ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది.

కనుక ఈ కారణంగా జగన్‌కు ‘రక్షణ కవచం’ తొడిగి కాపాడుతారా?లేదా చంద్రబాబు నాయుడు సాయంతో ఎన్డీయేకు దూరంగా ఉండిపోయిన పార్టీల మద్దతు కూడగట్టుకుంటారా? ఒకవేళ కేంద్రం జగన్‌కు ‘రక్షణ కవచం’ తొడగాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఏమి చేస్తారు?రక్షణ కవచం దొరక్కపోతే జగన్‌ ఏమి చేస్తారు?అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories