చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం ప్రజలకు ఉంది గానీ, ప్రభుత్వం మాత్రం పెద్ద ‘సుడిగుండం’లో చిక్కుకుందన్న భావన ఏపీ అధికార వర్గాలలో వ్యక్తమవుతోంది.
గత అయిదేళ్లుగా కనివిని ఎరుగని రీతిలో జగన్ చేసిన అకృత్యాలు, అక్రమాలు, విధ్వంసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రతి విభాగాన్ని సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రశ్నలే గానీ, సమాధానాలు వెలువడడం లేదు.
జిల్లాకో ప్యాలెస్ తో వెలుగు చూసిన జగన్ అక్రమాలు, రాళ్లపై బొమ్మలు చెక్కించుకునే వరకు కొన్ని వేల కోట్లు ప్రజాధనం వృధా కావడం ఏ మాత్రం జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఇలా ప్రతి రోజూ ఏదొక అంశంపై జగన్ అధ్వాన పరిపాలనా విధానం బయట పడుతూనే ఉంటోంది.
ఇంత అరాచకపు అధ్వాన పరిపాలన చేసి కూడా, నేడు మీడియా సమక్షంలో ‘అమాయక చక్రవర్తి’ లాగా కల్లబొల్లి కబుర్లు చెప్తూ ఉపన్యాసాలు ఇవ్వడం ఒక్క జగన్ మోహన్ రెడ్డికే చెల్లుబాటు అవుతుండడం ఏపీ ప్రజలకు మింగుడు పడని అంశంగా మారుతోంది.
జగన్ చేసిన పరిపాలనను ఏకరువు పెడుతూ ప్రజలకు తెలియజెప్పడం ఎంత ముఖ్యమైన విషయమో, దానిపై కఠిన చర్యలు తీసుకోవడం అంతకంటే ముఖ్యమైన విషయంగా ‘చంద్రబాబు అండ్ కో’ పరిగణించాలనేది ప్రజల ఆకాంక్ష.
అలాంటి ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకునే ప్రజలు 164 సీట్లతో పట్టం కట్టారని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు భావించాలి. అవినీతి, అక్రమాల గురించి ప్రజలు గుర్తించారు కాబట్టే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం 11 సీట్లతో వైసీపీని పక్కన కూర్చోపెట్టారు.
సీఎం పీఠం అధిష్టించిన నాటి నుండి నిత్యం 18 గంటలు పనిచేసినా, ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే, ఎంతటి దుస్థితికి రాష్ట్రాన్ని జగన్ తీసుకువచ్చారో చంద్రబాబే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేసిన ‘జగన్ అండ్ కో’పై చర్యలు తీసుకుని, చట్టపరంగా వారికి తగిన శిక్షలు పడే రోజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు.
ఇంత విధ్వంసాన్ని చేసి కూడా తామే అధికారంలో ఉన్నట్లు జగన్ అండ్ కో ప్రగల్భాలు పలుకుతుండడం, ప్రత్యర్థులను రెచ్చగొడుతుండడం అధికార పార్టీల కార్యకర్తలకు, అభిమానులకు జీర్ణించుకోలేని అంశంగా మారుతోంది.
చట్టపరంగా జగన్ పై చర్యలు తీసుకోకుండా ఉన్నట్లయితే, ‘పాముని పాలు పోసి పెంచినట్లే’ అన్న సామెత మాదిరి, మళ్ళీ ఆ విషపాము 2029లో ప్రజలను కాటేస్తుందని హెచ్చరించడం అధికార పార్టీల వర్గాల వంతవుతోంది.
‘సమస్యల సవాళ్ల సుడిగుండం’లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టి అభివృద్ధి పధంలో నడిపించడం ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి చేటు చేసేటటువంటి ‘జగన్ అండ్ కో’ను కట్టడి చేయడం కూడా అంతే ముఖ్యం.




