మరో సంవత్సరంలో జగన్ పాదయాత్ర 2.0 మొదలుకాబోతుంది అంటూ వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే తన పార్టీ లీడర్లకు, క్యాడర్ కు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో జగన్ వైఖరి పట్ల వైసీపీ శ్రేణులకు స్పష్టత రాకపోయినప్పటికీ రాష్ట్ర ప్రజానీకానికి పూర్తి స్పష్టత వచ్చింది.
ఇదిలా ఉంటే ఒక్కసారి గతానికి వెళ్తే, ప్రజాసంకల్ప యాత్ర పేరుతో నవంబర్ 6, 2017 న జగన్ చేపట్టిన జగన్ పాదయాత్ర తన సొంత జిల్లా అయిన కడప లోని తన సొంత నియోజకవర్గం పులివెందులలో భాగమైన ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సాగించారు.
అయితే 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర లో రాష్ట్ర రాజధానిగా అమరావతికి వైసీపీ సమ్మతమే అంటూ అందుకు తన తాడేపల్లి ప్యాలస్ ను ఆధారంగా చూపించారు. రాజధాని ఇక్కడే నా ఇల్లు ఇక్కడే అంటూ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మార్పు ఉండదంటూ ప్రజలకు హామీ ఇచ్చి చివరికి మూడు రాజధానులు అంటూ ఐదేళ్ల ప్రభుత్వ విలువైన సమయాన్ని, వేలకోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసేసారు.
మరి ఇప్పుడు జగన్ 2.0 కోసం అంటూ సరిగ్గా పదేళ్ల తరువాత తిరిగి జగన్ 2027 న మొదలుపెట్టనున్న పాదయాత్ర 2.0 ను తన ప్లాన్ బి మావిగన్ నుంచి మొదలుపెట్టనున్నారా.? అసలు మావిగన్ అనే ఒక ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో వైసీపీ ఎలా చిత్రీకరించనుంది. దానిని తన పాదయాత్రతో ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లనుంది.
రాష్ట్ర రాజధానిగా అమరావతి వద్దు మావిగన్ యే ముద్దు అంటూ జగన్ తన పాదయాత్ర 2.0 ను మొదలుపెట్టగలరా.?అందుకు వైసీపీ పార్టీలోని కృష్ణ, గుంటూరు, అమరావతి నాయకులు ప్రజలను కాదని, ప్రజాభిప్రాయాన్ని వద్దని తమ రాజకీయ భవిష్యత్ కి పణంగా పెట్టి మరి జగన్ వెంట నడవగలరా.? అందుకు మరో ఐదేళ్లు రాజకీయాయ్ నిరుద్యోగులుగా మారగలరా.?
అలాగే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మూడు రాజధానులు అంటూ కాదు కాదు విశాఖే రాజధాని అంటూ ప్రకటనలు చేసి ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించిన జగన్ అండ్ కో ఇప్పుడు రాజధాని ఇక్కడ కాదు మావిగన్ అని చెప్పి స్థానికంగా ప్రజలను ఓట్లడగగలరా.? వైసీపీ నేతల నిలకడ లేని ప్రకటనలతో అక్కడి ప్రజలు ఏకీభవించగలరా.?
అమరావతిని కాదని తమ ప్రాంతానికి రాజధాని అంటూ వైసీపీ ప్రకటించినా అక్కడి ప్రజలు వైసీపీ ని కాదని అమరావతికే జై కొట్టి కూటమి వెంట నడిచారు. మరి అలాంటి పరిస్థితులలో జగన్ ఇప్పుడు మరోసారి అమరావతి కి వ్యతిరేకంగా అడుగులు వేస్తే 151 కాస్త 11 అయినట్టు ఇప్పుడు ఆ 11 కాస్త సింగిల్ డిజిట్ గా మారుతుందా.?
మావిగన్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటూ వైసీపీ ప్రకటిస్తుంటే మావిగన్ వైసీపీ రాజకీయ భవిష్యత్ కి ఒక పద్మవ్యూహమని రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. అయితే మావిగన్ ఒక్క వైసీపీ రాజకీయ భవిష్యత్ ని మాత్రమే కాదు జగన్ నాయకత్వానికి కూడా ఒక సవాల్ గా మారనుంది.




