వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తాలూకా రాజకీయం ఇప్పటికి టీడీపీ – వైసీపీ ల మధ్య మాటల యుద్దానికి దారి తీస్తూనే ఉంది. మా తాత రాజారెడ్డి హత్య వెనుక, మా తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక బాబు పాత్ర అంటూ వైఎస్ జగన్ చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పటికి ఇరు వర్గాల వాదనలతో మీడియాలో మండుతూనే ఉంది.
జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి మీడియా ముందుకొచ్చారు. దీనితో వైఎస్ జగన్ తాత రాజారెడ్డి గత రాజకీయ చరిత్ర నుంచి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన రాజకీయాల వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించారు.
1962 లోనే పులివెందుల పీఎస్ లో రాజారెడ్డి మీద రౌడీ షీట్ ఉందని, ఆనాటి రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజకీయంలో ప్రజాదరణ కలిగిన ఎందరో నేతలను రాజారెడ్డి హతమార్చారని ఆరోపించారు. 1968 లో రాజారెడ్డి సతీమణి జగన్ నాయనమ్మ, జయమ్మ పులివెందులలో వార్డు మెంబెర్ గా పోటీ చేస్తే కృష్ణ మూర్తి అనే వ్యక్తి చేతిలో ఘోరంగా ఓడిపోయారని,
ఒక వార్డు మెంబెర్ గా కూడా గెలవలేని గత రాజకీయ చరిత్ర మీది అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు బీటెక్ రవి. అబద్దాలు, అరాచకాలు జగన్ జీవితమని, వైఎస్ వివేకనంద రెడ్డి దారుణ గొడ్డలి వేటు పై కూడా బీటెక్ రవి జగన్, అవినాష్ కేంద్రంగా ఆరోపణలు చేసారు.
ఇక రాజారెడ్డి మరణం వెనుక ఉన్నారంటూ జగన్ ఆరోపించిన పార్ధసారధి రెడ్డి కూడా వైఎస్ గత రాజకీయ చరిత్రను నేటితరానికి వివరించారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు శాంతి దూతలని, వారికంటే పెద్ద శాంతి దూత గౌతమ బుద్ధుడు జగన్ మోహన్ రెడ్డి అంటూ నాటి రాజారెడ్డి హయాంలో పులివెందులలో జరిగిన రాజకీయ అరాచకాలను వివరించారు.
వైఎస్ జగన్ తన ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన ఈ ఒక్క అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇటు టీడీపీ నేతల వాదన ఇలా ఉంటే అటు వైసీపీ నుంచి ఆ పార్టీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు.
పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నీచంగా మాట్లాడారని, అసలు వారికీ వైఎస్ కుటుంబం పై విమర్శలు చేసేంత స్థాయి ఉందా.? నోరు అదుపులో పెట్టుకో రవి, నువ్వెంత నీ బతుకెంత.?
ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు రేపు జవాబు చెప్పే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో రవి అంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బిటెక్ రవికి కౌంటర్ ఇచ్చారు. అయితే అసలు ఇలా ఒక కుటుంబంలోని తాతలను, తండ్రులను తెరమీదకు తెచ్చిందెవరు..? అసలు ఇటువంటి రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు.?
ఎప్పుడో దశాబ్దాల ముందు జరిగిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలను తన వ్యాఖ్యలతో తిరిగి ప్రచారంలోకి తెచ్చిందెవరు.? దీని ద్వారా వైఎస్ జగన్ సాధించిందేమిటి.? వైసీపీ పార్టీకి ఒరిగేందిమిటి.? నాటి తరం పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలను నేటి తరానికి తెలియచేయడం, తద్వారా వైసీపీ ఏదోఒక వివాదస్పద అంశంతో రాజకీయ కాలక్షేపం చేయడం అంతేగా..!




