వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని మీడియాలో వార్తలు వచ్చాయి. జగన్ అన్యమతస్థుడు కనుక ఈసారైనా ‘డిక్లరేషన్’ ఇస్తారా లేదా?ఇవ్వకపోతే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ని ఆలయంలోకి అనుమతిస్తారా లేదా?అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.
జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను అ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు.
ఇది తమ అధినేతని అప్రదిష్టపాలు చేసేందుకు జరుగుతున్నా దుష్ప్రచారమే తప్ప ఆ వార్తలలో నిజం లేదని చెప్పారు. మీడియాలో వస్తున్న ఈ కట్టుకధలని, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
టిటిడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి జగన్ తిరుమల పర్యటన గురించి మీడియాలో వార్తలు వస్తే అవి దుష్ప్రచారమని ఖండించడం సిగ్గుచేటు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన జగన్, తాను అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అందరూ సగర్వంగా చెప్పుకునే రాజధాని ఏర్పాటు కావాలని, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలని కోరుకోవాలి. రాష్ట్ర ప్రజలందరూ ఇలాగే కోరుకుంటున్నారు.
కానీ జగన్ మాత్రం స్వయంగా శాంతి భద్రతలకు కలిగిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీలో ధర్నాలు చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దని, రాష్ట్రానికి అప్పులు ఇవ్వవద్దని, వరద నీళ్ళలో మునిగిపోయే అమరావతిలో ఎవరూ పరిశ్రమలు, ఐటి కంపెనీలు పెట్టవద్దని లేఖలు వ్రాయిస్తుంటారు.
ఇక వైసీపీ సోషల్ మీడియాలో అమరావతి వరద నీళ్ళలో మునిగిపోయిందని, పోలవరం బ్యారేజ్ కొట్టుకుపోయిందని రకరకాలుగా దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది. అవేవీ వైసీపీకి తప్పుగా అనిపించవు. పైగా వాటిని తమ రాజకీయ వ్యూహాలుగా భావిస్తుంటుంది.
కానీ ఓ మాజీ ముఖ్యమంత్రి కనీసం సామాన్య ప్రజలలాగ కూడా ఆలోచించకపోగా చాలా హీనంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా దురాలోచనలు చేస్తుండటం చాలా శోచనీయం. తన రాష్ట్రానికి నష్టం కలిగిస్తూ, మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ కోరుకోవడం ఇంకా విచిత్రం.
ఇటువంటి నీచమైన పనులు చేస్తూ ఇదే రాజకీయమనుకునే వైసీపీకి, మీడియాలో ‘జగన్-తిరుమల పర్యటన’ అనే ఓ చిన్న వార్త వస్తే అది చాలా తప్పుగా అనిపించింది.
టిటిడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి జగన్ తిరుమల వస్తున్నారని వార్త వస్తే అది దుష్ప్రచారమని చెపుతున్నారు. ఆవిధంగా చెప్పడం ఆయనకు తప్పుగా అనిపించలేదు.






