మనుషులు తమకు లేనివాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇందుకు ఉదాహరణగా జగన్ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవచ్చు. ఆయనకు లేనిదే విలువలు, విశ్వసనీయత. కానీ అవి పుష్కలంగా ఉన్నాయని ఆత్మవంచన చేసుకుంటుంటారు.
కానీ లేదని అంతరాత్మ చెపుతూనే ఉంటుంది. కనుక అంతరాత్మ ‘చెప్పుడు మాటలు’ వినకూడదని, వింటే తనని తానే అసహ్యించుకోవలసి వస్తుందని, మరింత గట్టిగా విలువలు, విశ్వసనీయత గురించి జగన్ లెక్చర్లు ఇస్తుంటారు.
అసలు జగన్ తనకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయని అని అనుకోవడానికి కారణం ఏమిటి?అని ఆలోచిస్తే సంక్షేమ పధకాలు అమలు చేసినందునే అని అనుకుంటున్నట్లున్నారు. కనుక వాటిని అన్నిటికీ ఆపాదించేసుకుంటూ, ఈ లోకంలో తనకు తప్ప మరెవరికీ విలువలు, విశ్వసనీయత లేవని అందరినీ భ్రమింపజేయాలని జగన్ ప్రయత్నిస్తుంటారు.
ఆక్రమాస్తుల కేసులలో జైలుకి వెళితే తన విలువలు, విశ్వసనీయత కోల్పోయానని జగన్ అనుకోలేదు. పైగా వాటి కోసమే తాను జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని నేటికీ గర్వంగా చెప్పుకుంటారు. అప్పుడు తన కోసం, తన వలననే విజయసాయి రెడ్డి కూడా చంచల్గూడా జైలులో గడిపారు కదా?మరి ఆయనకీ విలువలు, విశ్వసనీయత ఉన్నట్లే కదా?
కానీ ఆయన తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఆయన క్యారక్టర్ లేని మనిషి, విలువలు, విశ్వసనీయత లేని మనిషి అని జగన్ ఒక్క ముక్కలో తేల్చేశారు.
కానీ తనకే విలువలు, విశ్వసనీయత రెండూ లేవని భావించబట్టే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారని జగన్ అనుకోవచ్చు కదా?
నాడు తెలంగాణలో వైసీపీ నేతల మొదలు, తల్లీ, చెల్లీ, వాలంటీర్ల వరకు అందరినీ రోడ్డున పడేసినప్పటికీ తనకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయనే జగన్ నమ్ముతుండటం విశేషం.
వైసీపీ ఓటమికి తానే కారణమని ఒప్పుకోవడానికి చెప్పుకోవడానికి జగన్కి నోరు రాకపోవచ్చు. కనీసం విలువలు, విశ్వసనీయత కూడా లేవనే అంతరాత్మమాట అయినా విని తనని తాను మార్చుకుంటే ఆయనకే మంచిది.




