ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వచ్చేదేలే అని కుండబద్దలు కొట్టిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ నేడు అనూహ్యంగా ఎవరు ఊహించని నిర్ణయాన్ని ప్రకటించి అటు కూటమి కి ఇటు వైసీపీ కి షాక్ ఇచ్చారనే చెప్పాలి.
పార్టీ నేతల కోసం జైలు యాత్రలు, పరామర్శ యాత్రలు చేస్తున్నారు, అలాగే వారానికి రెండు సార్లు బెంగుళూర్, తాడేపల్లి ప్యాలస్ ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కానీ తనను నమ్మి ఓటేసిన ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్ కు సమయం లేదా.?
అసెంబ్లీకి వేళ్ళని పక్షంలో జగన్ సహా వైసీపీ నేతలంతా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చెయ్యాలి అంటూ అటు కూటమి నుంచి ఇటు చెల్లి షర్మిల నుంచి ఎదురవుతున్న విమర్శల వేడికి, 60 రోజులు ఏకధాటిగా అసెంబ్లీకి రాని పక్షంలో వారి పై అనర్ధత వేటు వేసే అవకాశం ఉందంటూ డిప్యూటీ స్పీకర్ RRR చేస్తున్నహెచ్చరికలకు జగన్ తన నిర్ణయంతో చెక్ పెట్టారనే చెప్పాలి.
ఈ నెల 24 న జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలంటూ వైసీపీ నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ, శాసన మండలిలో పాల్గొని పార్టీ తరపున ప్రజా గొంతు వినిపించడానికి వైస్ జగన్ సిద్ధమయ్యారు. మొన్న మిర్చి యార్డు పర్యటన విజయవంతం కావడం, జగన్ విమర్శల పై స్పందిస్తూ ముఖ్యమంత్రి బాబు మిర్చి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయడం వైసీపీ క్యాడర్ లో జోష్ పెంచింది.
జగన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం అటు పార్టీ లో కొత్త జోష్ ని నింపడంతో పాటు ఇటు ప్రత్యర్థి పార్టీల విమర్శలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మూన్నాళ్ళ ముచ్చటగా ముగుస్తోందా.? లేక అధికార పార్టీ నేతలకు ముచ్చమటలు పట్టించేలా వ్యూహాలు సిద్ధం చేస్తారా.? అనేది చూడాలి.




