వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో పార్టీ సమావేశం నిర్వహించి త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు.
ముందుగా ప్రతీ రాజకీయ పార్టీ, ప్రతీ నాయకుడుకి పనికొచ్చే మంచి మాట జగన్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ స్థాయిలో పార్టీ తరపున పోటీ చేస్తున్నవారికి ఎమ్మెల్యేలతో సహా అందరూ సహకరించాలి. తనకు పార్టీ అండగా ఉందనే నమ్మకం కల్పిస్తే అప్పుడు ధైర్యంగా ప్రత్యర్ధులను ఎదుర్కోగలుగుతారు.
ఎన్నికలలో విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు మీరు గ్రామా, మండల స్థాయిలో పార్టీ నేతలకు సాయపడి గెలిపించుకుంటే, రేపు శాసనసభ ఎన్నికలప్పుడు వాళ్ళే మీకు సైన్యంలా మారి మిమ్మల్ని గెలిపించుకుంటారు.
కనుక పార్టీలో సీనియర్లు అందరూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మన పార్టీ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతీ ఊర్లో, ప్రతీ ఇంటిపై మన పార్టీ జెండాయే రెపరెపలాడాలి. అది మీ అందరి బాధ్యత,” అని హితబోధ చేశారు. ఇది అందరూ నేర్చుకోదగ్గ మంచి విషయమే కదా?
ఇంత చక్కటి సలహా చెప్పిన జగన్మోహన్ రెడ్డే తన పార్టీ నేతలను బెదిరిస్తున్నట్లు మరో మాటన్నారు. “ఈసారి ఎక్కడైనా (కూటమి నేతల ఒత్తిడితో) ఏకగ్రీవాలు జరిగినట్లు తెలిస్తే సహించే ప్రసక్తే లేదు. దానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏకగ్రీవాలు జరిగిన చోట్ల వారిపై చర్యలు తీసుకుంటాను,” అని జగన్ హెచ్చరించారు.
ఎన్నికలలో మన అభ్యర్ధిని గెలిపించాలని కోరడం సబబే. కానీ ఏకగ్రీవాలకు పనిష్మెంట్లు ఉంటాయని భయపెట్టడం సబబేనా?
సబబే అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఏకగ్రీవాలు కూడా తప్పే కదా? అప్పుడు ఏకగ్రీవాలు తమ పాలనని మెచ్చి ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించిన నోటితోనే ఇప్పుడు ఏకగ్రీవాలు తప్పు అంటే ఏమనుకోవాలి?




