ప్రతీ ప్రభుత్వమూ తమ పాలన, పనితీరు అద్భుతంగా ఉన్నాయనే చెప్పుకుంటాయి. ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టించేసిన జగన్, నేటికీ తన పాలన అద్భుతమని ‘సెల్ఫ్ సర్టిఫై’ చేసుకుంటున్నారు కదా?
అటువంటప్పుడు కూటమి ప్రభుత్వం తమ పాలన, పనితీరు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవడం తప్పెలా అవుతుంది?
ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ ఒకవేళ ప్రజలకు అది నచ్చకపోతే నిర్మొహమాటంగా ఎన్నికలలో తిరస్కరిస్తారు… అని చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కదా? కనుక చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటే జగన్ అసూయ పడటం దేనికి?
జగన్ మాటలలో వాస్తవాల కంటే ఆయన ఆక్రోశమే ఎక్కువగా కనిపిస్తోంది. సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు బావిలో దూకి చావాలనడమే ఇందుకు నిదర్శనం.
జగన్కి శపించే శక్తి లేదు. కనుక ప్యాలస్లో కూర్చొని ఇలా శాపాలు పెడుతూ కాలక్షేపం చేసే బదులు ప్రజల మధ్యకు, అసెంబ్లీకి వస్తే ఆయనకు, వైసీపీకే మేలు కలుగుతుంది కదా?
కానీ నేను అసెంబ్లీకి రానంటే రానని జగన్ తెగేసి చెప్పేశారు. ఈ విషయంలో ఆయనకు ఇంత క్లారిటీ ఉండటం మంచిదే. ఎందుకంటే రేపు ఎటువంటి పర్యవసానాలు ఎదురైనా ఎవరినీ నిందించకుండా భరించగలుగుతారు.
ఇంతకాలం శాసనసభకు రావాలంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అవసరమని జగన్ వితండవాదం చేస్తున్నారు. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా రాలేదు కదా?అంటూ తాను రాకపోవడానికి మరో కొత్త సాకు చూపుతున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు చేసేవన్నీ తప్పులేనని జగన్మోహన్ రెడ్డి నొక్కి చెపుతున్నప్పుడు, ఆయన చేసిన ఆ తప్పుని తాను ఎందుకు చేయాలి? శాసనసభ సమావేశాలకు హాజరయ్యి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవచ్చు కదా?
జగన్ తాను యువకుడిని, సింగిల్ సింహాన్ని, యుద్ధానికి సిద్దంగా ఉన్నానని చెప్పుకున్నారు. కనుక ధైర్యంగా శాసనసభకు వచ్చి వృద్ధుడైన చంద్రబాబు నాయుడుని ఎదుర్కోవచ్చు కదా? తాడేపల్లి ప్యాలస్లో, సొంత మీడియాలో చెపుతున్న మాటలనే శాసనసభకు వచ్చి చెప్పొచ్చు కదా?
కానీ రానని తెగేసి చెప్పడమే కాదు… తన సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకునేందుకు చాలా తెలివిగా హైకోర్టులో ఓ పిటిషన్ కూడా వేశారని ఆయనే బయటపెట్టుకున్నారు.






