రాజకీయాలలో మాటకారితనంతో సామాన్య ప్రజలను ఆకట్టుకోవచ్చు. అలాగే రప్పా రప్పా… తగ్గేదేలే వంటి సినిమా డైలాగులతో మరి కొంతమందిని ఆకర్షించవచ్చు. వైసీపీ అధినేత జగన్ మొదలు మాజీ మంత్రి రోజా వరకు అందరూ ఇదేవిధంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం మెడికల్ కాలేజీలపై అధికార, ప్రతిపక్షాల మద్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. కనుక వైసీపీ నేతలందరూ మీడియా ముందుకు వచ్చేసి ఏదేదో మాట్లాడేస్తున్నారు. రోజా స్పందిస్తూ, “విజన్ ఉంది.. విస్తరాకుల కట్టుంది… అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టించలేదు?” అని విమర్శించారు.
“మా అధినేత జగన్ పులివెందులలో ఒక మెడికల్ కాలేజి నిర్మాణం పూర్తిచేశారు. కూటమి ప్రభుత్వం పూనుకొని ఉంటే మిగతా 10 కాలేజీల నిర్మాణం కూడా ఈ 15 నెలల్లో పూర్తయ్యి ఉండేది. కానీ జగన్కి మంచిపేరు రాకూడదనే వాటిని నిర్మించలేదు,” అని రోజా ఆరోపించారు.
తమ ప్రభుత్వం 11 మెడికల్ కాలేజీలు కట్టించిందని, కాదు… 16,17 కాలేజీలని మరొకరు గొప్పలు చెప్పుకుంటున్నారు. వాటికి సమాధానంగా జగన్ హయంలో పునాదులు తవ్వి వదిలేసిన ఆ భవనాల ఫోటోలను టీడీపి నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వాటి పక్కనే జగన్ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలకోట్ల ప్రజాధనంతో కట్టుకున్న రాజమందిరాల వంటి వైసీపీ కార్యాలయాల ఫోటోలు కూడా పెట్టి నిలదీశారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళ పాలనలో తన సొంత నియోజకవర్గం పులివెందులలో ఒకే ఒక్క మెడికల్ కాలేజీ మాత్రమే కట్టించారని, మిగిలినవి అలాగే పడున్నాయని రోజా స్వయంగా ధ్రువీకరించారు కదా?
5 ఏళ్ళలో ఒకే ఒకటి కట్టించి 15 నెలల్లో ఎన్ని కట్టించారని లెక్కలు అడగడం సిగ్గుచేటు కాదా? అయినా చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో జగన్ అమరావతిని పాడుబెట్టి రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నప్పుడు రోజావంటి వైసీపీ నేతలు తమ అధినేతని ప్రశ్నించలేకపోయారు.
మెడికల్ కాలేజీలు కట్టించాకుండా ప్రజాధనంతో పార్టీ కార్యాలయాలు కట్టిస్తున్నప్పుడు ఎవరికీ తప్పుగా అనిపించలేదు. విశాఖ రుషికొండపై రూ.494 కోట్ల ప్రజాధనంతో జగన్ తన కోసం విలాసవంతమైన ప్యాలస్లు కట్టుకుంటే రోజాతో సహా వైసీపీ నేతలు వెళ్ళి గృహాప్రవేశ పూజ కూడా చేశారు!
జగన్ అసమర్దత, విలాసాలకు, వైసీపీ నేతల చాతకానితనానికి ఇన్ని ప్రత్యక్ష నిదర్శనాలు కళ్ళెదురుగా పెట్టుకొని, రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి రోజా వంటివారికి నోరెలా వస్తోందో?




