2014 విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఆదాయం, ఉపాధి, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీకి మొండి చెయ్యి చూపి ఏపీ భవిష్యత్తుని దెబ్బకొట్టారనే భావనలో ఏపీ ప్రజానీకం మునిగిపోయింది. దాని ఫలితంగానే ఏపీలో జరిగిన మొట్ట మొదటి ఎన్నికలలో రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరమని, పొరుగు రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి ఏపీని తీసుకురాగల సమర్థత ఉన్న పార్టీని ఎన్నుకోవడానికి ఆసక్తి చూపారు ఏపీ ఓటర్లు.
అయితే ఆ సమయంలో ఏపీ ప్రజలు సంక్షేమం మీద కాకుండా అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టి ఎన్నికల తంతును పూర్తి చేసారు. హైద్రాబాద్ తో పోటీ పడే మరో మహా నగరం ఏపీకి కూడా అవసరమని నమ్మి దాదాపు 33 వేల ఎకరాల భూమిని అమరావతి రైతులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అలాగే పోలవరం పూర్తి చేయడానికి అక్కడి స్థానిక ప్రజలు కూడా తమవంతు గా గ్రామాలను ఖాళీ చేసి వలస బాట పట్టారు. ఇదంతా ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమానికి ఆశపడో, ఆరాటాడో తీసుకున్న నిర్ణయాలు కాదు.
రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర భవిష్యత్తు ను పురోగమనం వైపు నిలపడానికి ఒక ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు చేసిన త్యాగాలు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, వారి త్యాగాలకు ఫలితాన్ని ఇవ్వడానికి తనకిచ్చిన ఐదేళ్ల సమయాన్ని అమరావతి నిర్మాణానికి, పోలవరం పూర్తి చేయడానికి ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పాలన కొనసాగించారు బాబు. 2019 లో జరిగిన ఎన్నికలలో జగన్ ఒక్క ఛాన్స్ ఉచ్చులోపడిన ఏపీ ప్రజలకు కట్టడాలు కాదు కూల్చివేతలను పరిచయం చేసారు జగన్.
నవరత్నాల పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తూ అభివృద్ధితో కాకుండా అప్పులతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ భవనాలను తాకట్టు పెడుతూ, రోడ్లు, మౌలిక వసతులను పక్కన పెట్టి, రాజధాని, పోలవరం రాష్ట్రానికి అవసరం లేదనే విధంగా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయి బటన్ నొక్కడానికే అన్న విధంగా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల సమయాన్ని అప్పులతో నెట్టుకొచ్చింది. 151 సీట్లతో ఇచ్చిన బలమైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు మీద కక్ష సాధించడానికి, బటన్ నొక్కడానికే వాడుకుంది వైసీపీ.
టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు కొదవలేదు. నవరత్నాల పేరుతో వైసీపీ, సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ రెండు కూడా తమతమ విధానాలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు. కానీ అటు సంక్షేమం తో పాటు రాష్ట్రానికి ఇటు అభివృద్ధి కూడా జరగాలి అంటే అది వైసీపీ తో సాధ్యం కాదని ఈ ఐదేళ్ల పాలనతో జగన్ నిరూపించుకున్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వాన్ని నమ్మి ఏ ఒక్క పరిశ్రమ కూడా ఏపీ సరిహద్దు దాటి ముందుకు రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే గతంలో ఉన్న పరిశ్రమలు కూడా మూటముల్లి సర్దుకుని పొరుగు రాష్ట్రాలకు తరలి పోయాయి.
ఈ పరిస్థితులలో 2024 లో జరిగిన ఎన్నికలలో ప్రజలు సంక్షేమానికి ఓటేశారా..? అభివృద్ధి వైపు నిలబడ్డారా..? అనేది తేలాలంటే మరో రోజు వేచి ఉండాల్సిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూసుకుంటే ఈసారి అధికారంలోకి వచ్చేది కూటమి పార్టీయే అని తేలిపోయింది. ఒకటి రెండు సంస్థలు మినహియిస్తే మిగిలిన అన్ని సర్వే సంస్థలు కూటమి పార్టీ విజయాన్ని నొక్కి వక్కాణించాయి. దీనితో ఇపుడున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమం కాదు అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారా.?




