వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో పార్టీ సమావేశం నిర్వహించి నేతలకు క్లాసు పీకారు. దానిలో సమగ్ర ఓటర్ జాబితా సవరణ (సర్)తో జరిగిన, జరుగబోయే అనర్ధం గురించి పార్టీ శ్రేణులకు వివరించారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో ‘సర్’ పేరుతో లక్షల కొద్దీ ఓట్లు తొలగించడం వల్లనే అక్కడి అధికార తృణమూల కాంగ్రెస్, డీఎంకే పార్టీలు, వాటి అధినేతలు మమతా బెనర్జీ, స్టాలిన్ కూడా ఓడిపోయారని జగన్ చెప్పారు.
తొలగించిన ఆ ఓటర్లు, ఓట్ల లెక్కలు చెప్పి ఇప్పుడు ఏపీలో మన వైసీపీ ఓటర్ల పేర్లు తొలగించకుండా ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ వైసీపీ శ్రేణులకు సూచించారు.
అంటే ఏపీలో తమ పార్టీని ఓడించేందుకు ‘సర్’ పేరుతో కుట్ర జరుగుతుందని జగన్ చెపుతున్నట్లే ఉంది. లేదా వైసీపీకి దొంగ ఓట్లు వేసేవారి సంఖ్య భారీగా ఉందని జగన్ ద్రువీకరిస్తున్నట్లే ఉంది.
జగన్ మరో మాట కూడా అన్నారు. ఆ రెండు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో ఓట్లు తీసేయడం వలన అక్కడి అధికార పార్టీలు ఓడిపోగా, ఇక్కడ ఏపీలో అధిక సంఖ్యలో ఓట్లు పడటం వలననే తాము ఓడిపోయామని అన్నారు.
అంటే కూటమి పార్టీలు దొంగ ఓట్లు వేసుకొని గెలిచాయని చెప్తున్నారన్న మాట. ఎన్నికలలో ఓడిపోయినప్పుడే జగన్ ఈవీఎంల వల్ల ఓడిపోయామని ఆరోపించారు.
కానీ మూడు రాజధానులు వంటి తన విచిత్రమైన నిర్ణయాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు వంటి అవలక్షణాల వలన ఓడిపోయామని చెప్పుకోవడానికి జగన్కి అహం అడ్డొచ్చి ఉండవచ్చు.
వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అదే పరిస్థితులు ఉంటాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. పైగా ఈసారి ‘సర్’ పేరుతో వైసీపీ ఓట్లు కోల్పోవచ్చనే భయం కూడా వెంటాడుతోంది. కనుక పార్టీలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరుతున్నారు.
గత ఎన్నికలలో టీడీపి, జనసేన కలిస్తే వైసీపీకి ఓటమి తప్పదని అందరి కంటే ముందు జగన్ పసిగట్టారు. ఇప్పుడూ అలాగే ‘సర్’తో 2029 ఎన్నికలలో వైసీపీ ఓటమిని జగన్ ముందే పసిగట్టారు.




