సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళితే అక్కడ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ అమిత్ షాలు ఆప్యాయంగా పలకరించి, ఎంతో కొంత చేతిలో పెట్టి పంపిస్తుంటారు. కానీ అదే అమిత్ షా విశాఖపట్నం వచ్చి జగన్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలలో మునిగితేలుతోందని అందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీలో అందరికీ పెద్ద షాక్. అందుకే ఇంతవరకు ఎవరూ కూడా నోరు విప్పలేకపోయారు.
టిడిపి, జనసేన నేతలో లేదా తెలంగాణ మంత్రులో చిన్న మాట అంటే అంతెత్తున ఎగిరిపడే వైసీపీ నేతలందరూ మౌనంగా ఉండిపోయారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే స్పందించారు. ప్రతి విమర్శలు చేయలేదు. కేవలం బాధపడ్డారు అంతే!
ఈరోజు పల్నాడు జిల్లా క్రోసూర్లో జగనన్న విద్యాదీవెన సభలో మాట్లాడుతూ, “మీ ఈ జగనన్నకు టిడిపిలాగ ఓ దత్తపుత్రుడు లేకపోవచ్చు. బిజెపి మద్దతు లేకపోవచ్చు. అయినా భయపడేది లేదు. పైనున్న ఆ దేవుడు, రాష్ట్రంలో ప్రజలందరూ నాకు అండగా ఉన్నారు. కనుక జరుగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మీరే ఈ జగనన్న సైన్యం. మీరే నాకు అండగా నిలబడాలని కోరుతున్నాను,” అని అన్నారు.
వైసీపీలో అందరూ ‘జగన్ ఒక్కరు చాలు… మా అందరినీ గెలిపించడానికి’ అని చెప్పుకొంటారు. ఆయనేమో పైనున్న ఆ దేవుడిని, కిందనున్న ప్రజలు ‘నన్ను గెలిపించాలని’ కోరుకొంటున్నారు.
సింహంలా ఒంటరిగా పోరాడుతున్నానని, 175 సీట్లు మావేనని, మరో 25-30 మేమే అధికారంలో ఉండబోతున్నామని గర్వంగా చెప్పుకొంటున్నప్పుడు, మళ్ళీ “నాకు దత్తపుత్రుడు లేడు…బిజెపి అండలేదని చెప్పుకోవడం వాపోవడంగానే అనిపిస్తోంది. బిజెపి తనకు అండగా నిలబడుతుందని బహుశః జగన్ ఆశించి ఉంటారు. కానీ అలా జరగడం లేదని బాధపడుతున్నట్లున్నారు.
అయినా టిడిపి-జనసేనలు పొత్తులు పెట్టుకొంటే రాజకీయ వ్యభిచారమని ఎద్దేవా చేస్తునప్పుడు, బిజెపితో వైసీపీ పొత్తులు ఆశించడాన్ని ఏమనుకోవాలి?అయినా బిజెపితో వైసీపీకి పొత్తులు లేనప్పుడు అది వైసీపీకి అండగా ఎందుకు నిలబడాలి?
ఇంతకాలం టిడిపి, జనసేనలు చేస్తున్న ఆరోపణలే జేపీ నడ్డా, అమిత్ షాలు కూడా చేయడంతో అవి తప్పు, అసత్యాలని ఖండించలేని దుస్థితిలో వైసీపీ చిక్కుకొంది. వైసీపీ పట్ల బిజెపి వైఖరి ఏమిటో అమిత్ షా, జేపీ నడ్డాలు చెప్పేశారు కనుక త్వరలోనే ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆంధ్రాకు వచ్చి జగన్ ప్రభుత్వంపై ఇవే విమర్శలు చేయకుండా ఉండరు. అప్పుడు ఆంధ్రా ప్రజలు ఎవరి మాట నమ్ముతారు?



