లోకం బాధలన్నీ తన బాధలుగా భావిస్తూ శ్రీశ్రీ కవిత్వం వ్రాసేవారు. కానీ తన మనసు బాధని లోకం బాధగా అభివర్ణిస్తూ దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు వ్రాసేవారని సాహిత్యలోకంలో ఓ జోక్ ఉంది.
ఎన్నికలలో ఘోరపరాజయం పొంది అధికారం కోల్పోయి ప్రజలకు మొహం చూపించలేక తాడేపల్లి, బెంగళూరు ప్యాలస్లలో కాలక్షేపం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దేవులపల్లివారితో సరిపోల్చలేము. కానీ జగన్ బాధ, గోల చూస్తున్నప్పుడు ఆయనలాగే తన బాధని లోకపు బాధగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.
అయితే దేవులపల్లి మనసులతో ఆడుకుంటూ ప్రజలను అలరిస్తే, జగన్ ప్యాలస్లో కూర్చొని సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూ శవరాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టం వచ్చిందన్నట్లు వాపోతున్నారు.
ఈ గోల భరించలేక వైసీపి నేతలందరూ దూరం అయ్యిన్నట్లున్నారు. వైసీపిలో ఎవరూ ఇప్పుడు ప్రజల మద్యకు రావడం మానుకున్నారు. చివరికి సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదిప్పుడు!
కానీ జగన్, ఆయన సొంత మీడియా మాత్రం ‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి… రోజూ దాడులు, హత్యలు, మానభంగాలు జరిగిపోతున్నాయంటూ’ ఓ లైన్ తీసుకొని దాంతోనే ముందుకు సాగిపోతున్నాయి.
బెంగళూరు ప్యాలస్లో జగన్మోహన్ రెడ్డిని ఇవాళ్ళ పలకరించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ రాలేదో ఏమో ట్విట్టర్లో పెద్ద మెసేజ్ పెట్టారు. దాని సారాంశం కూడా అదే.
రెండు నెలలు గడిచినా ఏపీలో పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. వైసీపి నేతలు, కార్యకర్తలు, వైసీపి సానుభూతిపరులు ఎవరూ రోడ్లపైకి రాకూడదన్నట్లు టిడిపి మూకలు దాడులకు తెగబడుతూ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయని, వీటికంతటికి కారణం ప్రభుత్వ పెద్దలే అని తేల్చేశారు.
అంటే తాము బయటకు రాకపోవడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణమని జగన్ ఓ కొత్తసాకు కనుగొన్నట్లున్నారు.
కానీ బాధితులకు అండగా నిలిచి పోరాడుతామని భరోసా ఇచ్చారు. కానీ ప్యాలస్లో నుంచి బయటకు రావడానికే భయపడుతున్న జగన్, బాధితులకు అండగా నిలబడి ఏవిదంగా పోరాడుతారో చెప్పనేలేదు. బహుశః ఇదేవిదంగా సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూ పోరాడుతామని జగన్ భరోసా ఇస్తున్నారేమో?
అమరావతి రైతులు అరసవెల్లి పాదయాత్రగా బయలుదేరినప్పుడు వైసీపి మూకలు వారిపై దాడులు చేసినప్పుడు జగన్కు తప్పుగా అనిపించలేదు. తమ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్ సమయంలో పోలింగ్ బూత్లోకి జొరబడి సిబ్బందిపై దాడి చేసి ఈవీఎం మెషిన్ ధ్వంసం చేసిన తప్పుగా అనిపించలేదు.
వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరంలో టిడిపి ఆఫీసుపై దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టిన్నప్పుడు జగన్కు ఎక్కడా అరాచకం కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రతీరోజూ, ప్రతీ గంట రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతూనే ఉన్నాయి.
జగన్ పాలనలో అరాచకాలపై చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టిడిపి నేతలు ధైర్యంగా ప్రజల మద్యకు వచ్చి పోరాడారు. ఒకవేళ ఇప్పుడు అరాచకాలు జరిగిపోతున్నాయనుకుంటె జగన్, వైసీపి నేతలు కూడా కలుగుల్లో నుంచి బయటకు వచ్చి టిడిపి కూటమి ప్రభుత్వంతో పోరాడవచ్చు కదా?ఎవరు వద్దన్నారు?కానీ కలుగుల్లో నుంచి బయటకు రావడానికి భయపడుతూ దానికీ చంద్రబాబు నాయుడినే నిందిస్తుండటం సిగ్గుచేటు కాదా?




