రాజకీయ పార్టీల అధినేతలు పిలుపు మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు నడుచుకోవడం సర్వసాధారణమే. కానీ ఈవిషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికాస్త ఎక్కువ అదృష్టవంతుడే అని చెప్పాలి.
ఆయన సిఎంగా ఉన్నప్పుడు అమరావతిని కాదని మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నప్పుడు పార్టీలో మేధావులు ఎవరూ వారించలేదు!
అమరావతిని, అభివృద్ధిని పక్కన పెట్టేసి సంక్షేమ పధకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు పార్టీలో మేధావులు ఎవరూ వారించలేదు!
మంత్రులు,ఎమ్మెల్యేలను కాదని వాలంటీర్లకు ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు, అలాగే 175/175 సీట్లు గెలుచుకోవడం అసాధ్యమని తెలిసి ఉన్నప్పటికీ పార్టీలో ఎవరూ వారించలేదు!
శాసనసభలో చంద్రబాబు నాయుడుని, అయన సతీమణిని కించపరుస్తూ మాట్లాడినప్పుడు, 2024 ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి జగన్ చాలా అనుచితంగా మాట్లాడుతున్నప్పుడు, వైసీపీ మేధావులు ఎవరూ ఆయనకు తప్పని చెప్పలేదు!
ఇప్పుడు అమరావతికి కేంద్రం చట్టబద్దత కల్పించినప్పుడు ‘మావిగన్’ అంటూ కొత్త ప్రతిపాదన చేస్తే మనకే నష్టమని పార్టీలో మేధావులు జగన్కు చెప్పలేదు!
అధినేత వరుసపెట్టి తప్పులు చేసుకుపోతుంటే వైసీపీలో అందరూ గుడ్డిగా ఆయనకు తాన తందానా పాడుతున్నారు తప్ప ఒక్కరూ వీటి వలన ప్రజలు మనకు దూరమవుతారని, రాజకీయంగా మనమే నష్టపోతామని ఎవరూ చెప్పడం లేదు! జగన్ ఏం నిర్ణయిస్తే దానిని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు.
కనుక ఇంత నమ్మకంగా పనిచేసే ఇలాంటి క్యాడర్ కలిగి ఉండటం జగన్ అదృష్టమనే చెప్పాలి. కానీ అందరూ కలిసికట్టుగా తప్పులు చేస్తుండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
మావిగన్ ప్రతిపాదనతో ఎల్లో మీడియా ఉలిక్కి పడిందని వైసీపీ వాదిస్తోంది. కానీ నిజానికి ఉలిక్కి పడింది, పడాల్సింది వైసీపీ శ్రేణులే!
ఎందుకంటే, జగన్ చెప్పే వరకు ‘మావిగన్’ గురించి వైసీపీలో ఏ ఒక్కరికీ తెలీదు. అయినప్పటికీ అందరూ గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. ఇది జగన్ అదృష్టమే కదా?
అమరావతికి కేంద్రం చేత ఆమోదముద్ర వేయించి రాజధానికి చట్టబద్దత కల్పించడం ద్వారా సిఎం చంద్రబాబు నాయుడు ప్రజల మనసులు గెలుచుకున్నారు. కానీ మావిగన్తో జగన్ కూటమి ప్రభుత్వంపై పైచేయి సాధించగలిగారా?లేదు!
నాడు విశాఖ రాజధాని అన్నప్పుడు విశాఖ ప్రజలు పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. ఇప్పుడు ‘మావిగన్’ ప్రతిపాదన పట్ల మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలు జగన్కి జేజేలు పలుకుతున్నారా? లేదు. కనీసం పట్టించుకోవడం లేదు.
మావిగన్తో కనీసం వైసీపీకి రాజకీయంగా ఏమైనా లాభం, మైలేజ్ లభించేలా చేయగలిగారా?అంటే అదీ కనపడదు. వైసీపీ భుజంపై ‘మావిగన్’ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని కాల్చేద్దామనుకుంటే అది కాస్త బ్యాక్ ఫైర్ అయ్యింది.. అని ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది.
కనుక డ్యామేజ్ కంట్రోల్ కోసం ఏదో ఒకటి చేయక తప్పదు. కానీ అది ఆంధ్రాలో చేయాల్సి ఉండగా హైదరాబాద్లో చేస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా?




