వచ్చే ఎన్నికలలో ఏపీలో త్రిముఖ పోటీ తధ్యం అన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. పేరుకు త్రిముఖ పోటీ అయినా…. ప్రధానంగా టిడిపి – వైసీపీల నడుమే పోటీ ఉంటుందన్నది కూడా బహిరంగ సత్యమే. అయితే ఓట్లను చీల్చే పార్టీగా జనసేన పాత్ర ఏమిటి? ఎన్ని సీట్లు కొల్లగొడుతుంది? ఎంత శాతం ఓటింగ్ ను రాబడుతుంది? అన్నది కీలకమైన అంశాలు.
అయితే పవన్ మాత్రం ఓ పది శాతానికి ఫిక్స్ అయిపోండి అంటూ పరోక్షంగా జనసేన స్టామినా గురించి చెప్పకనే చెప్పారు. “తొలుత జనసేనకు ఒక్క శాతం మాత్రమే ఓటింగ్ ఉందన్నారు, ఇటీవల సర్వేలో 10 శాతం ఉంటుందని చెప్తున్నారు. మోడీ, ట్రంప్ లు తొలుత 10 శాతం ఓటింగ్ ను దక్కించుకునే నాడు ఒకరు దేశ ప్రధాని, మరొకరు దేశ అధ్యక్షుడు అయ్యారు, మేం కూడా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.
అంటే పరోక్షంగా ఈ ఎన్నికలలో 10 శాతం ఓటింగ్ వచ్చి ఓడిపోయినా, భవిష్యత్తులో మోడీ, ట్రంప్ ల మాదిరి తాను కూడా అధికారంలోకి వస్తానన్న విషయాన్ని పవన్ చెప్పుకొచ్చారు. అసలు మ్యాటర్ ఏమిటంటే… ఓ పక్కన ఏపీ జనాలంతా మోడీపై గుర్రుగా ఉంటే, పవన్ మాత్రం ‘మోడీ అడుగుజాడల్లోనే’ అన్నట్లుగా వ్యాఖ్యానించడం కొసమెరుపు. అంటే ఈ వ్యాఖ్యల ద్వారా తాను ఎవరి మనిషిననేది పరోక్షంగా ప్రజలకు సంకేతాలు పంపుతున్నట్లేనా?!



