రాజకీయ నాయకుల ప్రసంగాలు విని విని విరక్తి చెంది ఉన్నారో లేక రొటీన్ రాజకీయాలకు భిన్నంగా పవన్ వ్యవహరిస్తున్నాడన్న నమ్మకం కలిగిందో ఏమో గానీ, తాజాగా విజయవాడలో జరిగిన అగ్రి గోల్డ్ బాధితుల సమావేశంలో బాధితుల స్పందన కాస్త భిన్నంగా ఉండడం విశేషం. నిజానికి పవన్ లాంటి స్టార్ హీరో, ఒక రాజకీయ నాయకుడు వచ్చినపుడు కాస్త హంగామా ఎక్కువై, సమస్య పక్కదారి పడుతూ ఉంటుంది. కానీ, ఇక్కడ బాధితుల్లో మాత్రం స్పష్టమైన వైఖరి కనిపించడం హర్షించదగ్గ విషయం.
ఈ సమావేశంలో పవన్ ఏం మాట్లాడారు? ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేసారు? బాధితులకు ఎలాంటి భరోసాను కల్పించారు? అన్న విషయం ఇప్పటికే మీడియా మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ సమావేశంలో అగ్రిగోల్ద్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ కే దిమ్మతిరిగే కోరిక కోరారు. అధికార పక్షం సమావేశాలలో ఆరోపణలు చేయడానికి ఆస్కారం లభించదు, ఇక ఏపీలో ప్రతిపక్ష నేత ‘ఏ సమస్య తీరాలన్నా ముందు నన్ను ముఖ్యమంత్రిని చేయమని’ ప్రజలను డిమాండ్ చేసే పరిస్థితి!
దీంతో ఇలాంటి బాధితులందరికీ ‘జనసేన’ అధినేత ప్రత్యామ్నాయంగా మారినట్లున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు… రొటీన్ రాజకీయ నాయకుల మాదిరి మాకు మీ దగ్గర నుండి ఎలాంటి స్టేట్మెంట్ లు వద్దు, అలాగే భరోసా ఉంటామనే హామీలు తదితర మాటలను పక్కనపెట్టి, ఆచరణకు సాధ్యమయ్యే మార్గాలను చూపాలని, తమకు న్యాయం జరిగేలా ఉద్యమించాలని కోరారు. నిజానికి పవన్ సిద్ధాంతం కూడా ఇలాగే ఉంటుంది. దీంతో పవన్ వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకుని ఈ ప్రకటన చేసారా? లేక ప్రతిపక్ష నేత ‘సిఎం కావాలనే వ్యాఖ్యలతో’ విసిగిపోయి చేసారా? అన్నది కీలకంగా మారింది.
పవన్ ను అర్ధం చేసుకుని సదరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం… ప్రజల్లో మార్పు వస్తున్నట్లే భావించవచ్చు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరో మలుపు తిరగడం ఖాయంగా చెప్పవచ్చు. ఇలాంటి ఓదార్పు సమావేశాలు, భేటీలు ఇప్పటికే చాలా జరిగాయి. ప్రతిసారి అధికార పక్షంపై దుమ్మెత్తిపోయడంతో తమ బాధ్యత అయిపోయిందని భావిస్తున్న ప్రతిపక్ష నేతలను కూడా ప్రశ్నించే రోజు త్వరలోనే ఉందన్న సంకేతాలను ప్రజలు పంపించిన వారవుతారు. అలాగే మరో వైపు జాగ్రత్తగా ఉండమని అధికార పక్షానికి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసినవారవుతారు.



