నేటికీ బీజేపీ, జనసేనలు సాంకేతికంగా పొత్తులోనే ఉన్నాయి. కానీ వాస్తవంగా టిడిపి-జనసేనలు పొత్తులో ఉన్నాయి. అప్పుడే కలిసి పనిచేస్తున్నాయి కూడా. కనుక బీజేపీ ఎటువైపు ఉంటుందో అని అందరూ ఆలోచిస్తుంటే, జనసేనే బీజేపీ వైపుకి వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
తెలంగాణలో ఎన్నికలకు ముందు బీజేపీ పరిస్థితి తారుమారు అవడంతో పవన్ కళ్యాణ్ మద్దతు కోరింది. పవన్ కళ్యాణ్ ముందు ‘నో’ చెప్పినప్పటికీ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యేసరికి మెత్తబడ్డారు. జనసేనకు 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. దీంతో రెండు పార్టీల మద్య పొత్తులు కుదిరాయి.
అయితే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలోని జనసేనకు కేటాయించిన ఆరు స్థానాలు కూడా కాంగ్రెస్, బిఆర్ఎస్, వామపక్షాలకు మంచి పట్టున్నవే. కనుక అక్కడ బీజేపీ అభ్యర్ధులే పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. కానీ ఇప్పుడు ఆ స్థానాలలో జనసేన పోటీ చేయబోతోంది. అంటే ఓటమికి సిద్దపడే బరిలో దిగుతోందనుకోవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరీ, నాంపల్లి, కూకట్పల్లి, మెదక్, శేరిలింగంపల్లిలో ఆంద్రా ఓటర్లు చాలా మందే ఉన్నారు. ఒకవేళ బీజేపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉండి ఉంటే వారందరూ దానితో జత కట్టిన జనసేనకే వేసి ఉండేవారేమో?
కానీ ఈసారి ఎన్నికల రేసులో బీజేపీ వెనకబడిపోయి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. కనుక తెలంగాణలో అధికారంలోకి రాలేదనుకొంటున్న బీజేపీకి, దానితో జత కట్టిన జనసేన కంటే, ఆ అవకాశం ఎక్కువగా ఉన్న బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకే మొగ్గు చూపుతారని వేరే చెప్పక్కరలేదు.
పైగా టిడిపి, వైఎస్ షర్మిల, ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. కనుక ఆంద్రా ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇక రాజకీయ కోణంలో నుంచి చూసిన్నట్లయితే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మరోసారి తప్పటడుగు వేసిన్నట్లు చెప్పవచ్చు. ఏపీలో టిడిపితో పొత్తులు పెట్టుకొని తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా ఏపీలో జనసేన, టిడిపి శ్రేణులలో, వాటి ఓటర్లలో పవన్ కళ్యాణ్ అయోమయం సృష్టించారని చెప్పొచ్చు.
తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నారు కనుక ఏపీలో కూడా బీజేపీతో పొత్తులు కొనసాగిస్తారా?టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా జత కడుతుందా?కట్టకపోతే పవన్ కళ్యాణ్ ఎవరివైపు ఉంటారు?అనే ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు ఇటువంటి గందరగోళం ఏ పార్టీకైనా రాజకీయంగా చాలా నష్టం కలిగిస్తుంది.
తెలంగాణలో బీజేపీ, జనసేన విజయావకాశాలు లేన్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఈ ఓటమి వలన బీజేపీకి కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదు కానీ దానితో పొత్తు పెట్టుకొని జనసేన ఓడిపోతే ఆ ప్రభావం ఏపీ శాసనసభ ఎన్నికలలో జనసేనపై తప్పక ఉంటుంది.
అంటే బీజేపీ కోసం జనసేన మరోసారి బలైపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బహుశః టిడిపి కూడా ఇందుకు మూల్యం చెల్లించవలసి రావచ్చునేమో?






