పార్టీ పెట్టి పదేళ్లైనప్పటికీ ఇంకా జనసేన అంటే పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే వినిపిస్తుంది, ఆయన బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. నాదెండ్ల, నాగబాబు వంటి నేతలు ఉన్నప్పటికీ వారికీ ప్రజా ఛరిష్మా తక్కువనే చెప్పాలి. 2024 ఎన్నికలలో 21 కి 21 సీట్లు గెలిచినప్పటికీ ఇక ఇతర పార్టీల మాదిరి మాస్ ను ఆకర్షించే లీడర్లు కానీ, అభిమానాన్ని ఓట్లుగా మలిచే నేతలు కానీ జనసేనకు ఇప్పటికి అందని ద్రాక్షే.
ఇప్పటి వరకు జనసేన ఓటమికి, జనసేన విజయానికి కేవలం పవన్ మాత్రమే కారణామనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. పవన్ రాజకీయ తప్పిదాలు, అనుభవరాహిత్యం గత ఎన్నికలలో ఓటమిని అందిస్తే, పవన్ నిజాయితీ, ఛరిష్మా, రాజకీయ వ్యూహాలు ఈ ఎన్నికలలో గెలుపుని పరిచయం చేసాయి.
అయితే పార్టీ పెట్టిన కొత్తలో జనసేన అంటే పవన్ తో పాటుగా ‘కళ్యాణ్ దిలీప్ సుంకర’ అనే మరో పేరు వినపడేది, అలాగే జనసేన గొంతుగా సోషల్ మీడియాలో ఆయన గళం వినిపించేది. జనసేన మద్దతుదారుడిగా, పవన్ అభిమానిగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో విరుచుకుపడడం, కత్తి మహేష్ వంటి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడం వంటి సంఘటనలతో జనసేన శ్రేణులకు కళ్యాణ్ దిలీప్ చాల దగ్గరయ్యారు.
ఆ అభిమానం ఏ స్థాయికి చేరిందంటే జనసేన ఉనికి కోసం సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ ఇంతలా పోరాడుతున్న పార్టీ ఈయనను ఎందుకు గుర్తించడం లేదు.? కళ్యాణ్ దిలీప్ ను పవన్ ఎందుకు పక్కన పెడుతున్నారు అంటూ పార్టీ పెద్దల మీద కూడా ఆ పార్టీ క్యాడర్ అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనితో అనధికార జనసేన సోషల్ మీడియా స్టార్ కాంపైనర్ గా దిలీప్ పార్టీ కార్యకర్తల దృష్టిని ఆకర్షించారు.
అయితే రాజకీయాలకు ఆవేశం కాదు ఆలోచన ఉండాలి, పార్టీ మీద అభిమానమే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి అనే రాజకీయ విలువలను పాటించే పవన్ సోషల్ మీడియా ఆవేశాలకు పార్టీ అవకాశం ఇవ్వదు అనేలా ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. దీనితో కళ్యాణ్ దిలీప్ జనసేనకు, పవన్ కు దూరం జరిగారు. అలాగే 2024 ఎన్నికలకు ముందు కళ్యాణ్ దిలీప్ స్వరంలో కూడా మార్పు రావడంతో జనసేన వర్గాలు ఒక్కసారిగా కంగుతిన్నారు.
అయితే కళ్యాణ్ దిలీప్ మాదిరే జనసేనలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మరో యువ నాయకుడు కిరణ్ రాయల్. ఈయన కూడా తన రాజకీయాలలో ఆలోచన కన్నా ఆవేశానికి తొలి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే గత పదేళ్ల నుంచి పార్టీ నే అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ కిరణ్ కు జనసేన పార్టీ నుండి టికెట్ అందలేదు. అనూహ్యంగా వైసీపీ నుంచి జనసేనకు వచ్చిన ఆర్ని శ్రీనివాసులు వైపు ఆకర్షితులయ్యారు పవన్.
అయితే పార్టీలో అంతర్గత పోరు నడుస్తున్నప్పటికీ కిరణ్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఇలా లక్ష్మి రెడ్డి అనే మహిళతో వివాదంలో చిక్కుకుని పార్టీ నుండి దూరమయ్యారు. అయితే ఈ దూరం తాత్కాలికంగా.? లేక కళ్యాణ్ మాదిరి శాశ్వతమా.? అనేది తేలాలంటే మరికొన్ని రోజుల సమయం అవసరమే.
దీనితో పవన్ ఇలాంటి ఆవేశపరులను ఎందుకు దూరంగా పెడుతున్నారు అనే ప్రశ్నకు పార్టీ శ్రేణులకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చిఉంటుంది. అయితే జనసేనలో కాస్త గుర్తింపు రాగానే ఇలా అనుకోకుండా నేతలు పార్టీని వీడడం మాత్రం ఊహించని పరిణామాలనే చెప్పాలి. మరి కిరణ్ రాయల్ ఈ చర్యలతో కూడా పార్టీకి రాయల్ గా ఉంటారా.? లేక దిలీప్ మాదిరి స్వరాన్ని మారుస్తారా.?




