జగన్ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుపుకోవడానికి చోటు దొరకకుండా చేసి ముప్పతిప్పలు పెట్టారు. చివరికి ఇప్పటం గ్రామంలో ఓ రైతు తన వ్యవసాయభూమిని ఇస్తే దానిలో సభ జరుపుకోవలసి వచ్చింది.
ఆ తర్వాత ఆ రైతుని వైసీపీ నేతలు ముప్పతిప్పలు పెట్టారు. అంతవరకు పట్టించుకోని ఇప్పటం గ్రామంలో రోడ్లు విస్తరణ పేరుతో జనసేన మద్దతుదారుల ఇళ్ళు పాక్షికంగా కూల్చివేసి కక్ష తీర్చుకున్నారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చి వెళ్ళినప్పుడు ఆయనపై కేసు నమోదు చేయడం బహుశః జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజలకి గుర్తుండే ఉంటుంది.
ఓ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరుపుకుంటే అధికారంలో ఉన్న పార్టీ ఇంత కక్షపూరితంగా వ్యవహరించాలా?అని ఆనాడే అందరూ అనుకున్నారు.
అప్పుడే కనుక జగన్ తన ధోరణి మార్చుకొని ప్రతిపక్షాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగించి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితిలో ఉండేవారే కారు.
కానీ ఆ తర్వాత టీడీపీ కార్యాలయాలపై దాడులు, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వంటివి వైసీపీ పతనానికి కారణమయ్యాయి.
జగన్ హయంలో పార్టీ ఆవిర్భావ సభ జరుపుకోవడానికి ఇబ్బంది పడిన జనసేన, ఇప్పుడు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, ఆ పార్టీలో కొందరు మంత్రులుగా ఉన్నారు.
కనుక పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం, చిత్రాడలో మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరుపుకోనుంది.
ఎన్నికలలో జనసేన 100 శాతం స్ట్రయిక్ రేటుతో గెలిచింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, నాదెండ్ల తదితర జనసేన నేతలు కీలకమైన శాఖల మంత్రి పదవులు చేపట్టారు. ఈ 8 నెలల్లో వారు, పవన్ కళ్యాణ్ తమ సమర్ధత నిరూపించుకున్నారు.
కనుక ఈసారి చాలా సంతోషంగా, అట్టహాసంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరుపుకోబోతున్నారు. జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారాని జగన్, వైసీపీ నేతలు ఆనాడు చాలా హేళనగా మాట్లాడారు.
ఇప్పుడు వారి కళ్ళ ముందే ఈ సభ జరుపుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ని మానసికంగా దెబ్బ తీసి రాజకీయాల నుంచి తప్పుకునేలా చేద్దామని జగన్ అండ్ కో అనుకుంటే, ఇప్పుడు వారే జనసేన, పవన్ కళ్యాణ్ల ఎదుగుదలని, ఈ సభని చూసి అసూయతో రగిలిపోయే పరిస్థితి నెలకొని ఉంది. అయినా వైసీపీ విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ ఇలా తేడా కొడుతోందేమిటో?




