జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజెపి పెద్దలతో నిన్న రాత్రి మరోసారి భేటీ అయిన తర్వాత ట్విట్టర్లో జనసేన పార్టీ ఓ ట్వీట్ పెట్టింది. అదేమంటే, “వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం. ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా పనిచేస్తాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుడదనేది మా ఆలోచన. బీజేపీ-జనసేన రెండు పార్టీలు సంస్థాగతంగా బలోపేతం అయ్యే దానిపై పనిచేయనున్నాము. మీరు అనుకున్న సమయానికి కాదు, మేము అనుకున్న సమయానికి పొత్తులపై క్లారిటీ ఇస్తాం- ఢిల్లీ పర్యటనలో @JanaSenaParty అధినేత శ్రీ@PawanKalyanగారు.”
ఇది జనసేన పార్టీ తెలియజేసినందున దీని ప్రకారం చూస్తే, పవన్ కళ్యాణ్ ఏపీలో బిజెపితో పొత్తులు కొనసాగించాలని, రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయమని మళ్ళీ చెప్పినప్పటికీ, టిడిపిని కలుపుకోకుండా జనసేన-బిజెపిలు కలిసి పనిచేస్తే తప్పకుండా ఓట్లు చీలిపోతాయని వేరే చెప్పక్కరలేదు. ఇక వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా పనిచేస్తామని చెప్పడానికి అర్దమేమిటంటే, జనసేన-బిజెపి కూటమికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉండబోతున్నట్లు భావించవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే బిజెపి, వైసీపీ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకొన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ ఈవిదంగానే ఎన్నికలు ఎదుర్కోవాలని కోరుకొంటోంది గనుక.
ప్రస్తుతం బిజెపి దృష్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంపైనే ఉంది తప్ప ఏపీపై లేదు. ఆ కారణంగా కేసీఆర్ కూడా బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకొంటున్నారు. కనుక లోక్సభ ఎన్నికల తర్వాత అవసరమైతే వైసీపీ ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఏపీలో వైసీపీ, టిడిపిల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటూ బిజెపి, జనసేన కూటమి గెలవడం అసంభవమని బిజెపి అధిష్టానానికి తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాలనుకొంతున్నట్లు జనసేన తాజా ట్వీట్తో అర్దమవుతోంది.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే వ్యవహరించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర విభజన వలన ఏపీలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా పర్వాలేదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే చాలనుకొంది. కానీ రెండు రాష్ట్రాలలో నష్టపోయింది అది వేరే విషయం. ఇప్పుడు బిజెపి అధిష్టానం కూడా అచ్చం అలాగే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో బిజెపి, జనసేన ఓడిపోయినా లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటుకి కావలసిన ఎంపీలు ఏపీ నుంచి దొరికితే చాలని భావిస్తున్నట్లుంది. కనుక ఈవిదంగా ఎన్నికలకు వెళితే పవన్ కళ్యాణ్ ఏది జరగకూడదని కోరుకొంటున్నారో అదే ఖచ్చితంగా జరుగుతుంది. బిజెపి-జనసేన, టిడిపి, వైసీపీల మద్య ఓట్లు చీలిపోతాయి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. జనసేన పార్టీ మరోసారి ఎన్నికలలో వీరమరణం పొందుతుంది లేదా కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోగలదు. ఎన్నికల తర్వాత వారు వైసీపీలో లేదా టిడిపిలో చేరిపోవడం ఖాయం.
ఇప్పుడే ఈవిదంగా చెప్పడం తొందరపాటే కావచ్చు కానీ ఈసారైనా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయకపోతే జరిగేది మాత్రం ఇదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.



