పిఠాపురంలో ఈ హడావుడి ఏమిటో…

JanaSena Pawan Kalyan Pithapuram MLA

ఈసారి పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై జనసైనికులు ఎంత నమ్మకంగా ఉన్నారంటే తమ బైకులకు నంబర్ ప్లేట్స్ స్థానంలో ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకు’ అని బోర్డులు తయారుచేయింప జేసుకొని బిగించుకొని పట్టణంలో తిరుగుతూ హడావుడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ADVERTISEMENT

వారిని చూసి వైసీపి కార్యకర్తలు కూడా తమ బైకులకు ‘డెప్యూటీ సిఎం గారి తాలూకు’ అని బోర్డులు బిగించుకుని తిరగడం మొదలుపెట్టారు. వారి హడావుడి చూసి ప్రజలు నవ్వుకుంటుంటే, ట్రాఫిక్ పోలీసులకు ఏమనాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

ఎందుకంటే ఈసారి టిడిపి కూటమి, పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టమైన సంకేతాలు వచ్చేశాయి. పవన్‌ కళ్యాణ్‌ గెలిచి శాసనసభలో అడుగుపెడితే మంత్రి పదవి లభించవచ్చు కూడా. కనుక ఆయన అభిమానులను ఏమీ అనలేరు.

మరో పక్క వైసీపి అభ్యర్ధిగా పోటీ చేసిన వంగా గీత ఇంకా అధికారంలో ఉన్న వైసీపికి చెందినవారు. కనుక వైసీపి కార్యకర్తలను ట్రాఫిక్ పోలీసులు ఏమీ అనలేని పరిస్థితి.

గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ కళ్యాణ్‌ ఈసారి మాత్రం తప్పక గెలుస్తారని పిఠాపురంలో అప్పుడే టాక్ వచ్చేసింది. కనుక ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ళు ఆయన గెలుపు గురించి కాక ఎంత మెజార్టీ అనే దానిపై బెట్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

టిడిపి కూటమి గెలుపు విషయంలో కూడా ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ అనే దానిపైనే జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది.

పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం జనసేన కార్యకర్తలు ఎంతగా కష్టపడ్డారో, అక్కడి నుంచి పోటీ చేయాలనుకొని పవన్‌ కళ్యాణ్‌ కోసం ఆ సీటుని త్యాగం చేసిన వర్మ కూడా అంతే కష్టపడ్డారు. నిజానికి తన సీటుని పవన్‌ కళ్యాణ్‌ తన్నుకుపోయారని వర్మ బాధపడి ఉండాలి.

కానీ ఎన్నికల ప్రచారం పూర్తి బాధ్యత తన భుజాలపై వేసుకొని పనిచేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తూ ఆయనతో ప్రేమలో పడిపోయానని వర్మ చెప్పడం చూస్తే ఆయన పవన్‌ కళ్యాణ్‌ని ఎంతగా అభిమానిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. అంతేకాదు… చంద్రబాబు నాయుడు విదేశీయాత్ర ముగించుకొని హైదరాబాద్‌ తిరిగి రాగానే వెళ్ళి ఆయనను కలిసి ఈసారి పవన్‌ కళ్యాణ్‌ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారో చెప్పి వచ్చారు కూడా.

ADVERTISEMENT
Latest Stories