తెలంగాణ శాసనసభ ఎన్నికలలో జనసేన ఒంటరిగా 32 స్థానాలకు పోటీ చేసేందుకు మొదట సిద్దపడింది. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా-పవన్ భేటీ తర్వాత బీజేపీ, జనసేనల మద్య పొత్తులు ఖరారు అయిన్నట్లు సమాచారం. అయితే జనసేనకు 32 సీట్లకు బదులు కేవలం 8 మాత్రమే కేటాయించిన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె లక్ష్మణ్ ధృవీకరించారు.
తెలంగాణలో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయడం ఖాయం అయ్యింది కనుక లాభనష్టాల లెక్కలు చూసుకోక తప్పదు. బీజేపీతో జనసేన పొత్తులు పెట్టుకోవడం రాజకీయ తప్పిదమే అవుతుంది. ఏవిదంగా అంటే, ఏ పార్టీలో నేతలైనా ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచి అధికారంలోకి రావాలనే కోరుకొంటారు తప్ప ఏళ్ళ తరబడి రాజకీయాలలో ఉంటూ ప్రతీ ఎన్నికలలో త్యాగాలు చేయాలనికోరుకోరు కదా? కానీ ప్రతీ ఎన్నికలలో బీజేపీ కోసం జనసేన త్యాగాలు చేసేందుకు సిద్దపడుతున్నప్పుడు ఇక ఆ పార్టీలో ఎవరు చేరాలనుకొంటారు?ఎందుకు కొనసాగాలనుకొంటారు?కనుక 32కి బదులు 8 సీట్లకు జనసేన సర్దుకుపోవడం నిజమైతే రాజకీయంగా ఇది పెద్ద తప్పే అవుతుంది. బీజేపీ కోసం జనసేన త్యాగాలు చేస్తూపోతే ఆ పార్టీని నడిపించడం అనవసరమే కదా?ఈ మాత్రం దానికి పవన్ కళ్యాణ్ సినిమాలు మానుకొని రాజకీయాలలో తిరుగుతూ మాటలు పడటం కూడా అనవసమే కదా?
ఇక ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ కూడా ఈసారి ఎన్నికలలో పోటీ ప్రధానంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్యనే ఉంటుందని, బీజేపీ మూడో స్థానానికే పరిమితం కావచ్చని చెపుతున్నాయి. తెలంగాణ ప్రజలు కూడా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఏది గెలుస్తుందనే మాట్లాడుకొంటున్నారు తప్ప బీజేపీ గురించి చర్చించడం లేదు. కనుక ‘విశాల ప్రయోజనాలు’ పేరుతో విజయావకాశాలు తక్కువగా ఉన్నపార్టీతో పొత్తులు పెట్టుకోవడం రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే అని చెప్పకతప్పదు.
ఒకవేళ బీజేపీ-జనసేన కూటమి గెలిస్తే జనసేన నేతలలో పార్టీ పట్ల ఏర్పడిన ఈ అపనమ్మకం, అసమ్మతి తొలగిపోవచ్చు కానీ, ఓడిపోతే తెలంగాణలో జనసేన మూతపడుతుంది. ఒకవేళ బీజేపీ ఓడిపోయి, జనసేన రెండు మూడు స్థానాలు మాత్రమే గెలుచుకొంటే ఏమవుతుంది?అంటే గెలిచినవారు జనసేనకు గుడ్ బై చెప్పేసి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానిలో చేరిపోతారు. కనుక జనసేన 8 స్థానాలకు పోటీ చేసి గెలిచినా దానికి రాజకీయంగా ప్రయోజనం లభించదని అర్దమవుతోంది.
ఇక తెలంగాణలో బీజేపీ, జనసేనల గెలుపోటముల ప్రభావం తప్పకుండా తర్వాత జరుగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలపై కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. తెలంగాణలో బీజేపీ కలిసి పోటీ చేసినందున ఏపీలో దానితో పొత్తులు కొనసాగించవలసి ఉంటుంది. కనుక అప్పుడు టిడిపిని వదులుకొని బీజేపీతో కలిసి సాగాలనుకొన్నా లేదా టిడిపితో కలిసి సాగుతూ బీజేపీని విమర్శించినా పవన్ కళ్యాణ్ విశ్వసనీయత దెబ్బ తింటుంది. నేటికీ ఆయనకు రాజకీయ నిలకడలేదని ఆంధ్రా ప్రజలు భావిస్తే, నష్టపోయేది జనసేన… దానితో పొత్తులు పెట్టుకొనే పార్టీయే.
తెలంగాణలో జనసేన కనీసం 2-3 స్థానాలనైనా గెలుచుకొంటే, ఏపీలో ఉత్సాహంగా దూసుకుపోగలదు. కానీ ఓడిపోతే?ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. టిడిపితో పొత్తులు పెట్టుకోబోతోంది కనుక సీట్ల కోసం గట్టిగా డిమాండ్ చేయలేదు. చేసినా లభించకపోవచ్చు.
ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో జనసేన ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నప్పటికీ తప్పనిసరిగా అది పోటీ చేయబోతున్న అన్ని సీట్లు కాకపోయిన వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాల్సి ఉంటుంది. లేకుంటే 2029 ఎన్నికల వరకు ఏపీలో జనసేన మనుగడ సాగించడం కష్టమవుతుంది. అదే జరిగితే గత పదేళ్ళుగా పవన్ కళ్యాణ్, జనసేన నేతలు చేస్తున్న కృషి, ఖర్చు అంతా వృధా అవుతుంది కూడా.
ఒకవేళ టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా కలిస్తే ఆ లెక్కలు వేరేలా ఉంటాయి. బీజేపీ ఇందుకు ఇష్టపడటం లేదు కనుక వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం.






