చప్పగా ఉన్న జయలలితపై నివేదిక!

Jayalalithaa Death Report - Apolloతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో అందించిన చికిత్సపై ఎయిమ్స్ వైద్యులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక వివరాలను తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. గత సెప్టెంబర్ 22న రాత్రి 10 గంటలకు అప్పటి ముఖ్యమంత్రి జయలలితను అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు. జయలలిత శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, ఆసుపత్రికి రాగానే ఆమెకు పలు పరీక్షలు నిర్వహించామని వైద్యులు సదరు నివేదికలో తెలిపారు.

ఆ పరీక్షల్లో జయలలితకు డీహైడ్రేషన్ తో పాటు ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడ్డాయని గుర్తించిన తర్వాత, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం చికిత్స అందించింది. ప్రభుత్వం కోరిక మేరకే ఎయిమ్స్ నుంచి వైద్య బృందం జయలలితకు చికిత్సనందించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. కొందరు నేతలు, పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా ఆసుపత్రిలో జయలలితపై ఎలాంటి కుట్ర జరగలేదని, మద్రాసు హైకోర్టుకు కూడా ఇదే నివేదికను తమిళనాడు ప్రభుత్వం అందించనుంది.

ADVERTISEMENT

72 రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం గుండెపోటు రావడంతో జయలలిత మృతి చెందారని, ఎక్మో సపోర్ట్ సిస్టమ్ ను అందించినా జయలలితను కాపాడుకోలేకపోయినట్టు నివేదిక పేర్కొంది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలకు కూడా తెలిపినట్టు నివేదిక వెల్లడించింది. కాగా, జయలలిత మృతిపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ పన్నీరు సెల్వం ఆమరణ నిరాహారదీక్షకు దిగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన దీక్షకు ముందుగానే ఎయిమ్స్ వైద్యుల నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేసింది. అయితే చికిత్స జరుగుతున్న సమయంలో జయలలిత దగ్గరకి ఇతర ప్రముఖులను ఎవర్నీ ఎందుకు అనుమతించలేదన్న దానికి మాత్రం సమాధానం చెప్పకపోవడం విశేషం. గతంలో చెప్పిన విషయాలనే ఒక నివేదిక రూపంలో వెల్లడించిన ఈ సంగతులను ప్రజలు ఎంతమాత్రం విశ్వసిస్తారో అన్నది ప్రశ్నార్ధకమే. ఈ నివేదికలో ఒక్క కొత్త విషయం కూడా లేకపోవడంతో చప్పగా ఉందని పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.

ADVERTISEMENT
Latest Stories