ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం అంటే అంత సులువైన కార్యం కాదు. దానికి ఎంతో నేర్పు, ఓర్పు, సాహసం, చాణుక్యం ఇలా ఎన్నో వాటి మీద పూర్తి అవగాహన, పట్టు సాధించగలగాలి.
అలాగే సమకాలీన రాజకీయాలలో ప్రత్యర్థులను దాటి ముందుకెళ్లాలి అంటే వీటన్నిటతో పాటుగా ఆర్థిక బలం కూడా మిండుగా ఉండి తీరాల్సిందే. ఒక్కోసారి అన్ని ఉన్నా కూడా కాలం కలిసిరాకపోవచ్చు.
అటువంటి పరిస్థితులన్నిటిని తట్టుకుని నిలబడగలిగితేనే రాజకీయాలలో తననుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. అయితే ఇలా ఎన్నో ఆశలతో రాజకీయాలలోకి అరంగేట్రం చేసిన కొంతమంది ప్రముఖులు గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారు.
వారిలో అందరికి సుపరిచమైన పేరు జేడీ.లక్ష్మి నారాయణ. 2019 లో జనసేన పార్టీ తరుపున విశాఖపట్నం ఎంపీగా బరిలోకి దిగిన జేడీ ఆ ఎన్నికలలో తన పార్టీ తో పాటుగా తానూ ఓటమిని ఎదుర్కొన్నారు. అయితే ఆ ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేసిన ఒక్క స్థానంలో తప్ప మిగిలిన అన్ని స్థానాలలో ఓటమి చెందడంతో పవన్ కు గుడ్ బై చెప్పి జనసేనకు రాజీనామా చేసారు.
ఇక 2024 ఎన్నికలలో ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అంటూ సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగారు. అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలడానికి ఆస్కారం ఇవ్వని ఏపీ ప్రజలు మరో పార్టీ వైపు చూసే సాహసం కూడా చెయ్యలేదు. దీనితో జేడీ రాజకీయ జీవితం ఇక శుభం కార్డు పలకడానికి సిద్ధంగా ఉన్నట్టు తయారయ్యింది.
ఆనాడు జేడీ జనసేనను వీడి ఉండక పోయిఉంటే నేడు ఏపీ రాజకీయాలలో ఆయన స్థానం, స్థాయి మరోలా ఉండి ఉండేది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్. జేడీ బాటలోనే గమ్యం లేని రాజకీయ ప్రయాణాన్ని ఎంచుకున్నారు జై భీం అంటూ వచ్చిన జడ శ్రావణ్.
న్యాయవాద వృత్తిని వదులుకుని దళితుల అభ్యున్నతికే తన ఈ రాజకీయ ప్రయాణం అంటూ ‘జై భీం భారత్ పార్టీ’తో ప్రజల ముందుకొచ్చారు జడ శ్రావణ్ కుమార్. అయితే ఈయన గారి రాజకీయాన్ని గమనిస్తే అది దళితుల అభ్యున్నతి కోసం కాదు జగన్ మెప్పు కోసం వైసీపీ గెలుపు కోసం అన్నట్టుగా సాగుతున్నాయి.
ఇలా ఎదో సాధించేయాలి అంటూ రాజకీయాలలో రావడం ఇక్కడ ఉన్న ఒడిడుకులు తట్టుకోలేక గమ్యం లేని ప్రయాణాలు చేయడం చివరికి ప్రజల మెప్పు పొందలేక జెండా పీకేయడం రాజకీయాలలో సర్వ సాధారణమైన విషయమైపోయింది.




