విశ్వసనీయ సమాచారం మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేనను వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. లక్ష్మీనారాయణతో పాటు ఆయన అనుచరుడు గంపల గిరిధర్ కూడా జనసేనకు హ్యాండ్ ఇచ్చి…. వీరిద్దరు బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఎన్నికల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్మీనారాయణను పక్కన పెడుతున్నారు. ఇటీవలే పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన పొలిట్ బ్యూరో లో గానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ లో గానీ ఆయనకు చోటు దక్కలేదు.
ఉద్దేశపూర్వకంగానే ఆయనను పక్కన పెట్టారని లక్ష్మీనారాయణ రగిలిపోతున్నారట. పార్టీ సమావేశాలలో కూడా ఆయన పాల్గొనడం లేదు. 2019 ఎన్నికలకు ముందు సీబీఐ జేడీ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ చేసిన జేడీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత బీజేపీలో చేరుతాడని, కొత్త పార్టీ పెట్టనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ.. అనూహ్యంగా లోక్సత్తాలో చేరి.. ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరాలనుకున్నారు.
ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును సైతం కలిశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ పార్టీలో చేరలేకపోయిన ఆయన.. ఉన్నట్లుండి జనసేనలో చేరారు. ఇక ఈ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గాజువాకలో పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఓట్లు కంటే ఆయనకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం. జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుండి వెళ్ళిపోతే అది ఆ పార్టీకి పెద్ద దెబ్బ కావొచ్చు. ఇక ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదు అనే సిగ్నల్స్ వెళ్తాయి.



