jogi-ramesh-in-tdp-programmes

వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కన్ను మిన్ను కానక నోటికి ఏది వస్తే అది వాగుతూ, చేతికి ఏది దొరికితే అది పట్టుకుని బరి తెగించి చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్లిన జోగి రమేష్ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో సిగ్గు వదిలి టీడీపీ కార్యక్రమాలలో పాల్గొంటూ కూటమి ప్రభుత్వంతో రాజీ మార్గాలు అన్వేషిస్తున్నారు.

అసలు టీడీపీ నేతలు కూడా ఇటువంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని పార్టీ కార్యక్రమంలోకి ఎలా ఆహ్వానించారు అంటూ పార్టీ క్యాడర్ తో పాటు లోకేష్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఏలూరు జిల్లా నూజివీడు లో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో టీడీపీ నేతలతో కలిసి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా పాల్గొన్నారు.

Also Read – బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది?

ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాయి. దీనితో త్వరలో జోగి రమేష్ వైసీపీకి నామం పెట్టి టీడీపీ సైకిల్ ఎక్కబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటువంటి వార్తలను పార్టీ అధిష్టానం వెంటనే ఖండించకపోతే ఇవి పార్టీ క్యాడర్ ను అయోమయంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది.

ఈ నేపథ్యంలో నారా లోకేష్ టీడీపీ కార్యక్రంమలోకి జోగి ఎంట్రీకి అనుమతి ఇచ్చింది ఎవరన్నదానిమీద పార్టీ శ్రేణులను వివరణ కోరినట్టు సమాచారం. తమ అధినేత పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పట్ల అంత పెద్ద మనసు చాటిన ఆ వ్యక్తి ఎవరన్నది ఇటు పార్టీ క్యాడర్ కు కూడా మింగుడు పడని అంశంగా మారింది.

Also Read – భారత్‌ క్షిపణు దాడులు నిజమే: ఒప్పేసుకున్నారు!

ఇప్పటికే కూటమి ప్రభుత్వం జోగి మీద ఆయన కుమారుడు మీద పలు కేసులు నమోదు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనలో జోగి పాత్ర మీద కూడా చాలానే ఆరోపణలున్నాయి. అలాగే అగ్రి గోల్డ్ భూముల విషయంలో ఆయన కుమారుడు జోగి రాజీవ్ బైలు మీద తిరుగుతున్నాడు.

ఇటువంటి కీలక సమయంలో జోగికి టీడీపీ లోకి ఎంట్రీ అనేది అందని ద్రాక్షే అవుతుంది. అలాగే అటు పార్టీ పెద్దలు కూడా జోగి వ్యవహార శైలి మీద గుర్రుగా ఉన్న నేపథ్యంలో అసలు ఈయనకు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది, దాని వెనుక ఉన్న అజ్ఞాత శక్తి ఎవరన్నది తేలాల్సి ఉంది.

Also Read – మిస్ వరల్డ్-2025: ఇప్పుడేమంటారు కేటీఆర్‌?


టీడీపీ నేతల ఈ అలసత్వం మీద నారా లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఎవరికీ నచ్చిన వారిని వారు పార్టీ అధిష్టానంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా అధికారిక కార్యక్రంలోకి ఆహ్వానించడం ఎంతవరకు సమంజసమో సమాధానం చెప్పాలి.