కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ ఉత్సాహంతో ‘పోలవరం’ ప్రాజెక్ట్ తొలి దశ పనులను 2018 నాటికి పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కేంద్రమంత్రులు కూడా చెప్తున్నారు. అయితే మాటలు చెప్పినంత వేగంగా పనులు జరగాలంటే… పట్టిసీమ ప్రాజెక్ట్ తరహాలో 24X7 కార్మికులు, అధికారులు కష్టపడాల్సిందే. అంతేకాదు, అత్యాధునిక పరికరాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అతి పెద్ద ట్రక్ ను త్రివేణి ఎర్త్ మూవర్స్ కొనుగోలు చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసమే దీనిని వినియోగించబోతున్నట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి ట్రక్ లు చాలా అరుదుగా ఉంటాయి. జాతీయ రహదారుల నిర్మాణం, మైనింగ్, భారీ ఉపకరణాలను తరలించడానికి వినియోగించే ఈ ‘బెలాజ్ 7530’ పేరు గల ట్రక్ పొడవు 13.39 కాగా, వెడల్పు 7.82 మరియు ఎత్తు 6.65 మీటర్లుగా ఉంది.
ఈ ట్రక్ ద్వారా ఏకంగా 240 టన్నుల వరకు బరువులను తరలించవచ్చని, గంటకు 60 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదని త్రివేణి ఎర్త్ మూవర్స్ తెలిపింది. ఇంత భారీ పరిమాణం గల ట్రక్ ఎలా తీసుకువచ్చారు అన్న సందేహం కలగడం సహజమే. అయితే ఎక్కడి నుండో దిగుమతి చేసుకున్న ట్రక్ కాదు, పోలవరం ప్రాజెక్ట్ పరిసరాల్లోనే దీనిని రూపొందించారు. ట్రక్ కు సంబంధించిన విడి భాగాలను సదరు ప్రాంతానికి తరలించి, అదే ప్రదేశంలో అసెంబుల్ చేసారు.



