మరో 5 రోజులలో ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడబోతుంటే, నేటికీ ప్రతీరోజూ ఏవో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ ప్రముఖ మీడియా సంస్థ ప్రతినిధి కడపలో ఎగ్జిట్ పోల్ సర్వే చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం, కడప కంచుకోటలో వైసీపి ఓటర్లు ఈసారి క్రాస్ ఓటింగ్ చేశారు. పులివెందులలో కొంతమంది టిడిపి అభ్యర్ధి బీటెక్ రవికి ఓట్లు వేశారు. బద్వేల్, రాయచోటి, రాజంపేట, తదితర కొన్ని నియోజకవర్గాలలో ముస్లింలు టిడిపికి వేయగా, కడపలో వైసీపి ఓటర్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వైఎస్ షర్మిలకు ఓట్లు వేశారు. కడప పట్టణంలో ముస్లింలలో 50 శాతం మందిలో కొందరు టిడిపికి ఓట్లు వేయగా కొందరు ఓట్లే వేయలేదు.
కూతురికి ఓట్లు వేసి గెలిపించాలని విజయమ్మ పిలుపుని గౌరవిస్తూ కడప ప్రజలు వైఎస్ షర్మిలకు ఓట్లు వేయగా, మరికొందరు ‘ఇద్దరూ వైఎస్సార్ బిడ్డలే… ఇద్దరినీ గెలిపించుకుందామనే’ ఆలోచనతో ఎంపీ ఓటు వైఎస్ షర్మిలకు, ఎమ్మెల్యే ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేశారు.
కడప నుంచి వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేయడం, వివేకా హత్య కేసు గురించి ఆమె, సునీత చేసిన వాదనలు, వాటికి జగన్, అవినాష్ రెడ్డి సమాధానం చెప్పుకోలేకపోవడం, కూతురినే గెలిపించాలని విజయమ్మ పిలుపు, ఈసారి కూటమి గెలిచి అధికారంలోకి రాబోతోందనే మౌత్ టాక్ వంటి పలు అంశాలు కడప జిల్లా ప్రజల వైఖరిలో ఈ మార్పులకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
కనుక కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో నారా లోకేష్ని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని కసితో రగిలిపోయిన జగన్మోహన్ రెడ్డికి కడపలో వైసీపి ఓడిపోతే అది చెంపదెబ్బే అవుతుంది




