వైసీపీ హయంలో కాకినాడ పోర్టు, దానికి అనుబంధంగా ఉన్న సెజ్ భూములను మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు సీపోర్ట్ ప్రధాన భాగస్వామి కర్నాటి వేంకటేశ్వర రావుని బెదిరించి రూ.3,600 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా అరబిందో కంపెనీ పేర బదలాయించుకున్నారు. ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన తర్వాత, వారు హడావుడిగా వాటిని వెంకటేశ్వరరావుతో మాట్లాడుకొని తిరిగి అప్పగిస్తూ మరో డీల్ చేసుకున్నారు.
అయితే కాకినాడలో మాత్రమే కాదు… తిరుమలలో కూడా వైసీపీ నేతలు ఇలాంటి కబ్జాలకు పాల్పడ్డారని టిటిడీ చైర్మన్ బీఆర్ నాయుడు బయట పెట్టారు.
ఇంతకీ ఈ కబ్జా కధ ఏమిటంటే, 2008లో అప్పటి ప్రభుత్వం తిరుమల కొండపై ‘దేవలోకం ప్రాజెక్టు’ నిర్మాణం చేయాలనుకుంది. కానీ దీనిని పీపీపీ పద్దతిలో నిర్మించాలనుకుంది. దీని కోసం తిరుమల కొండపై 38 ఎకరాలు వైష్ణవి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకి ఇచ్చేందుకు ఎంఓయూ చేసుకుంది.
కానీ ఈ ప్రాజెక్టుకి కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు లభించకపోవడం వలన నిలిచిపోయింది. ఎట్టకేలకు 2021లో ఈ ప్రాజెక్టుకి పర్యావరణ క్లియరెన్స్ లభించింది.
“కనుక అ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టబోతుంటే ఆ కంపెనీ డైరెక్టర్ అజయ్ కుమార్కి తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు వచ్చిందని బీఆర్ నాయుడు చెప్పారు. జగన్ ఆయన నుదుట తుపాకీ గురిపెట్టి బెదిరింఛి దానిలో 20 ఎకరాలు ముంతాజ్ హోటల్ యాజమాన్యానికి అప్పగించారు.
అంతే కాదు… ఏపీలో కనిపిస్తే మళ్ళీ కనబడకుండా లేపేస్తామని బెదిరించారు కూడా. దాంతో అజయ్ కుమార్ భయపడి ఇంత కాలం ఏపీకి దూరంగా వేరే రాష్ట్రంలో తల దాచుకున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
ఆ పిర్యాదులో జగన్ తనని తుపాకీ గురిపెట్టి బెదిరించారని కూడా అజయ్ కుమార్ పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా రావడంతో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేశారు.
ప్రభుత్వం సూచన మేరకు దానికి కేటాయించిన 20 ఎకరాలు వెనక్కు తీసుకోవాలని టిటిడీ నిర్ణయించింది,” అని టిటిడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి వంటి అన్యమతస్తుల చేతిలో టిటిడీని పెడితే శ్రీవారి మహా ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి పవిత్రతను ప్రతిష్టను దెబ్బ తీశారు.
తిరుమల కొండపై అన్యమతానికి చెందినవారితో ‘ముంతాజ్ హోటల్’ నిర్మించాలనుకోవడం, దాని కోసం ఈవిదంగా బెదిరించి భూములు లాక్కోవడం వంటివన్నీ చూస్తున్నప్పుడు, టిటిడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పినట్లు జగన్ తిరుమల శ్రీవారిపై, టిటిడీ, తిరుమల, ఏడుకొండలపై ఎందుకు ఇంతగా పగబట్టారు?అని సందేహం కలుగక మానదు.
తిరుమల శ్రీవారితో ఈవిదంగా ఆటలాడినందుకే నాడు రాజశేఖర్ రెడ్డి, తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించారని అయినా ఎందుకు చెలగాటం ఆడుతున్నారు? అని టిటిడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రశ్నిస్తున్నారు.






