తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్పై నిజామాబాద్ జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీ కవితకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆయనపై వేటు వేయ్యడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. డీఎస్ కుమారుడు భాజపాలో చేరారు. అప్పట్నుంచీ ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని కవిత ఆరోపిస్తున్నారు
తన కుమారుడు ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయాలంటూ ఆరేడు నెలలుగా డీఎస్ తెరాస కార్యకర్తలను ఒత్తిడి చేస్తున్నారని కూడా కవిత ఆరోపించారు. అయితే ఇదంతా కవితకు నిజామాబాదులో ఇబ్బందిగా పరిణమించడం వల్లే అంటున్నారు కొందరు. డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీ తరపున నిజామాబాదు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.
దీనితో డీఎస్ వర్గం వ్యతిరేకంగా పని చేస్తే గెలవడం కష్టం అని కవిత భావిస్తున్నట్టు సమాచారం. “నా తండ్రి డీఎస్ నాకు బీజేపీలో సాయం చేయడమేంటి ?. అది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. ఓటమి భయంలో కవిత ఉన్నారు. అందుకే ఇలాంటి చర్యలకు సిద్ధపడుతున్నారు. డీఎస్ను బీజేపీలోకి తేవాలంటే మా నాయకత్వం చూసుకుంటుందని” అని అరవింద్ వివరించారు.



