భారతీయ సినీ పరిశ్రమ విశిష్ఠ విలక్షణ నటుడిగా కీర్తించే కమల హాసన్ తన ఆస్తులను తన ఇద్దరు కుమార్తెలకు సమానంగా పంచేశారా? అంటే స్పష్టమైన సమాధానం తెలియనప్పటికీ… తమిళ మీడియాలో కమల హాసన్ తన ఆస్తిని శ్రుతి హాసన్, అక్షర హాసన్ లకు చెరి సగం చెందేలా వీలునామా రాసి ఇచ్చిన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ కాలం పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో కమల హాసన్ నటుడిగానే కాక, పలు సినిమాలకు దర్శకనిర్మాతగా వ్యవహరించారు.
అయితే కమల్ చేసిన సినిమాలు కొన్ని పరాజయం పాలవ్వడంతో, ఇతర నటీనటుల మాదిరి ఆశించినంత డబ్బును కూడబెట్టుకోలేదని ప్రచారంలో ఉంది. గతంలో ఈ విషయంపై కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ, తన మిత్రుడు కమల్ కి డబ్బు వెనకేసుకోవడం తెలియదని బహిరంగంగానే వాఖ్యానించారు. ఇప్పుడు ఆయన తన ఆస్తులను కుమార్తెలిద్దరికీ చెరి సమానంగా పంచుతూ వీలునామా రాశారని తెలుస్తోంది. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఈ పని చేసినట్టు తమిళనాడులో ప్రచారం జరుగుతుండడంతో, కమల్ క్లారిటీ కోసం అభిమానులు వేచిచూస్తున్నారు.
అయితే తమిళంలో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ కార్యక్రమం టీజర్ సందర్భంగా కమల్ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఈ వీలునామా వార్తలు ఊపందుకున్నాయి. “రెమ్యునరేషన్ తీసుకోకుండా తాను నటించలేనని, డబ్బు కోసమే తాను బుల్లితెరపై వ్యాఖ్యాతగా అవతారం ఎత్తానని కుండబద్దలు కొడుతూ కమల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. బుల్లితెర వల్ల ఓ వైపు డబ్బు సంపాదించవచ్చని, మరోవైపు అభిమానులకు సినిమాల కంటే ఎక్కువగా దగ్గరవ్వొచ్చని కమల్ చేసిన వ్యాఖ్యల తర్వాత వీలునామా తెరపైకి వచ్చింది. దీంతో కమల్ ఆర్ధిక కష్టాల్లో ఉన్నారా? అంటూ ఆరాలు తీయడం అభిమానుల వంతవుతోంది.



