కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ సిఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ పోటీ పడుతుండటం పెద్ద సమస్యగా మారింది. అయితే నిన్నటి వరకు ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని పట్టుబట్టిన శివకుమార్, ఈరోజు ఉదయం పూర్తిగా వెనక్కుతగ్గి పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం విశేషం.
ఈరోజు ఉదయం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, “నాకు కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. కనుక కలలో కూడా కన్నతల్లికి ద్రోహం చేయాలనే ఆలోచన నాకు రాదు. ముఖ్యమంత్రి పదవి కంటే కన్నతల్లి వంటి కాంగ్రెస్ పార్టీయే నాకు ముఖ్యం. కనుక నేను అసంతృప్తితో పార్టీని వీడుతానని, పార్టీని చీలుస్తానని, వెన్నుపోటు పొడుస్తానని మీడియాలో వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నాను.
కాంగ్రెస్ అధిష్టానం నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే చాలా సంతోషిస్తాను. వేరెవరికి ఇచ్చినా సంతోషంగా వారికి సహకరిస్తాను. అంతే తప్ప ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీకి ద్రోహం తలపెట్టను. నిన్న నా ఆరోగ్యం బాగోలేక ఢిల్లీ వెళ్ళలేకపోయాను. ఇవాళ్ళ ఢిల్లీ వెళ్ళి మా కాంగ్రెస్ పెద్దలను కలుస్తాను. వారు ఏ నిర్ణయం తీసుకొన్నా అభ్యంతరం చెప్పకుండా శిరసావహిస్తాను,” అని శివకుమార్ చెప్పారు.
వర్తమాన రాజకీయాలలో ఇంత హుందాతనం చూసి చాలా రోజులే అయ్యింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ల కోసమే పార్టీలో ఒకరికొకరు గోతులు తవ్వుకొంటూ దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటారు. ఒంగోలులో తన ఎమ్మెల్యే సీటుకి ఎసరు పెట్టేందుకు వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారని బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. అటువంటిది ముఖ్యమంత్రి పదవికి అన్ని విదాల అర్హత, ఎమ్మెల్యేల మద్దతు కలిగి ఉన్నప్పటికీ డికె శివకుమార్ ఇంత హుందాగా పక్కకు తప్పుకొని తన పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనుకోవడం విశేషమే కదా?
శివకుమార్ నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్టానం తేలికగా ఊపిరి తీసుకోగలుగుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో బిజెపికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి అధికారం చేజిక్కించుకొనే అవకాశం కూడా కలగలేదు.



