అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నాయకులు జనం నవ్వితే నవ్విపోదురు గాక మాకేల సిగ్గూ ఎగ్గూ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారు.
దేశానికి ఐటి రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని ఓ ఐటి కంపెనీ సీఈవో ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే, ఐటి మంత్రి ప్రియాంకా ఖర్గే ‘ఉంటే ఉండండి.. పోతే పొండి… ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తామంటే కుదరదు’ అని చాలా పొగరుగా సమాధానం ఇచ్చారు.
ఏపీకి గూగుల్ కంపెనీ వెళ్ళిపోతునప్పుడు కూడా ఇలాగే చాలా గీరగా మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం రాయితీలు ఎరగా వేసి గూగుల్ని పట్టుకుపోయిందని కానీ ఐటి కంపెనీలకు అంతంత రాయితీలు ఈయవలసిన అవసరం లేదని, మేము ఏ రాయితీలు ఇవ్వకపోయినా ఐటి కంపెనీలు బెంగళూరుకే వస్తాయన్నారు.
ఇది వాస్తవమే కావచ్చు. కానీ పెట్టుబడులు, ఐటి కంపెనీలను ఆకర్షించడానికి రాష్ట్రాలు పోటీ పడుతున్నప్పుడు, కర్ణాటక ప్రభుత్వ ధోరణి ఈవిదంగా ఉంటే ఉన్న కంపెనీలు కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మితమవుతున్నప్పుడు, అందమైన సముద్రతీరం ఉన్న విశాఖలో ఐటి కంపెనీలకు ఏపీ ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించి రాయితీలు ఇస్తున్నప్పుడు, ఇరుగు పొరుగు రాష్ట్రాలు తమ ఐటి కంపెనీలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ‘పోతే పొండంటే’ పోకుండా ఉంటాయా?
బెంగళూరు రోడ్ల పరిస్థితిపై భారత్ వ్యోమగామి శుభాన్షు శుక్లా కూడా కర్ణాటక ప్రభుత్వానికి చురకలు వేశారు. ‘బెంగళూరు టెక్నాలజీ సమిట్’కు హాజరైన శుక్లా, “నేను ఇక్కడికి చేరుకోవడానికి మూడు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ నా ప్రసంగం గంటలో పూర్తి చేశాను,” అని వ్యంగ్యంగా అన్నారు.
బహుశః ఆయనపై కూడా కర్ణాటక మంత్రులు విరుచుకు పడొచ్చు. కానీ బెంగళూరు రోడ్ల సమస్యకు అది పరిష్కారం కానే కాదు!
సరే! దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని సరిపెట్టుకున్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న కీచులాటలు చూస్తున్నప్పుడు, పదవి, ప్రభుత్వానికి నిలకడలేదనిస్తుంది.
సిద్ధరామయ్య ప్రభుత్వానికి రెండేళ్ళు పూర్తవడంతో ఆయనని గద్దె దించి తాను ఆ కుర్చీలో కూర్చోవాలని డికే శివకుమార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించి దించేస్తే, అందుకు ఆగ్రహం చెందిన సిద్ధరామయ్య లేదా మరొక సీనియర్ డికేని గద్దె దించేందుకు ప్రయత్నించకుండా ఉంటారా?
నాడు జగన్ భారీ మెజార్టీతో అధికారంలో ఉన్నప్పటికీ పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తే ఏం జరిగిందో అందరూ చూశారు. ఇప్పుడు కర్ణాటక మంత్రులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. కనుక పర్యవసానాలు కూడా అలాగే ఉంటాయి. నాడు జగన్ ధోరణి తెలంగాణకు సువర్ణావకాశంగా మారినట్లే, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వ ధోరణి ఏపీకి వరంగా మారవచ్చు.







