వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి ఆంజనేయ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలను వ్యభిచార కేంద్రాలతో పోల్చారు. ‘అవి పాఠశాలలు కాదు, అధిక చార్జీలు వసూలు చేస్తున్న వ్యభిచార కేంద్రాలు… సంపాదన కోసమే వాటిని ఏర్పాటు చేశారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వ్యభిచార కేంద్రాల మాదిరిగా ప్రజల నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయని, అయితే ఇదే సమయంలో మంచి పాఠశాలలు కూడా ఉన్నాయని అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆంజనేయ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అయితే, మంత్రి వ్యాఖ్యలపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. సీబీఎస్ఈ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలీఖాన్ మాట్లాడుతూ… మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి పద ప్రయోగాలు చేయరాదని, ఆయనపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.



