ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్ళి మోడీ, అమిత్ షా తదితరులను కలిశారని వైసీపీ మంత్రులు అందరూ నొక్కి చెపుతుండటం ఆలోచింపజేస్తోంది. మరో 4-5 నెలల్లో తెలంగాణతో సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటితో కలిపి ఏపీ శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఢిల్లీ పెద్దలను ఒప్పించేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఢిల్లీలో బుదవారం జరిగిన అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖల మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రయోజనాల కోసమే సిఎం జగన్ ఢిల్లీ వచ్చి మోడీ, అమిత్ షా తదితరులను కలిశారు తప్ప రాజకీయాల కోసం కాదు.
అయితే ఎన్నికలు ముందే వచ్చినా, ఆలస్యంగా వచ్చినా ఎదుర్కొనేందుకు మేమూ సిద్దంగా ఉన్నాము. మాకు ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు. వచ్చే ఎన్నికలలో కూడా మేమూ ఒంటరిగానే పోటీ చేసి గతంలో కంటే ఎక్కువే సీట్లు గెలుచుకొంటాము. టిడిపి, జనసేన, బిజెపి ఇంకా బిఆర్ఎస్ పార్టీలు కట్టకట్టుకొని వచ్చినా ఎదుర్కొనేందుకు మేమూ సిద్దంగా ఉన్నాము. ఏపీ బిజెపికి అధ్యక్షుడుగా ఎవరిని నియమించుకొన్నా మాకేమీ తేడా లేదు,” అని అన్నారు.
ముందస్తు ఆలోచన లేనప్పుడు తొమ్మిది నెలల పదవీకాలం ముగుసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పుకోవాలి. కానీ ఎన్నికలు ముందొచ్చిన్నా, వెనకొచ్చినా… అని మంత్రి కారుమూరి చెప్పడం గమనిస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలలో ఉన్నట్లు భావించవచ్చు.
ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటే, కేంద్ర ఎన్నికల కమీషన్కు ఈవిషయం ముందుగా తెలియజేయాలి. ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు వీలుగా ఆగస్ట్ నెలాఖరులోగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవలసి ఉంటుంది. కనుక సిఎం జగన్ ముందస్తు ఎన్నికలకి వెళుతున్నారా లేదా అనే విషయం ఇక ఎంతో కాలం దాచిపెటలేరు. ఆగస్ట్ నెలాఖరులోగా బయటపెట్టక తప్పదు. కనుక అంతవరకు అందరూ వేచి చూడక తప్పదు.



