కవిత ఆరోపణల యాక్షన్ కు బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ రియాక్షన్ రావడంతో ఇక కవిత vs బిఆర్ఎస్ ల మధ్య ఇన్నాళ్ళుగా సాగుతున్న దాగుడుమూతల ఆటకు తెరపడి ప్రత్యక్ష యుద్ధం మొదలయ్యింది.
అయితే పార్టీ నుండి తనను సస్పెండ్ చేసే ముందు కనీసం తన చర్యలకు వివరణ కూడా అడగకుండా అధినేత నన్ను ఉరి తీశారు అంటూ ఘల్లుమన్న కవిత ఇదంతా కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చి చేసిన చర్యలుగానే తానూ భావిస్తున్నట్టు ప్రకటించారు.
అయితే ఈ మొత్తం ప్రెస్ మీట్ లో కవిత ముఖ్యంగా హరీష్, సంతోష్ లను టార్గెట్ చేస్తూ వారిద్దరూ అవినీతిపరులంటూ, వారి అవినీతే కేసీఆర్ ను సీబీఐ విచారణ వరకు తీసుకెళ్ళిందంటూ వారి పై నిప్పులు చెరిగారు.
దానికి తోడు హరీష్ – రేవంత్ లను ఉద్దేశించి కవిత చేసిన ఒక ఆరోపణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ ను ఈ వివాదంలోకి లాక్కొచ్చాయి. నా పై ఈ కుట్రలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో చెప్పాలి అంటే అందుకు రేవంత్ – హరీష్ ల ఢిల్లీ ప్రయాణం గురుంచి ప్రస్తావించాల్సిందే అంటూ మొదలు పెట్టిన కవిత…,
రేవంత్ రెడ్డి – హరీష్ ఇద్దరు కలిసి ఢిల్లీకి ఒకే ఫ్లయిట్ లో ప్రయాణించారు. ఆ సమయంలో హరీష్, రేవంత్ కాళ్ళు పట్టుకున్నారు. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు తన పై ఈ తరహా కుట్రలకు తెరలేపారు అంటూ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉలిక్కిపడేలా వ్యాఖ్యలు చేసిన కవిత,
ఈ ఆరోపణలలో వాస్తవం లేదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ను హరీష్ ను ప్రశ్నించారు. నన్ను నా కుటుంబం నుంచి బిఆర్ఎస్ పార్టీ నుండి దూరం చేయాలనుకుని నాడు పునాదులు వేసుకున్న ఆ ప్రణళికలు నేడు అమలవుతున్నాయి. అయితే నేడు నావంతు గా నన్ను బలిపశువుని చేసారు, రేపటి రోజున ఇదే పరిస్థితి అన్న కేటీఆర్ కు, నాన్నా కేసీఆర్ కు కూడా ఎదురవ్వొచ్చు,
ఇప్పటికైనా కేసీఆర్ తన చుట్టూ ఎం జరుగుతుందో గమనించాలని, లేకుంటే ఆ శక్తులు బిఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకుంటారంటూ కవిత హరీష్, సంతోష్ ల పై సంచలమైన ఆరోపణలు చేసారు. అయితే కవిత చేస్తున్న ఈ ఆరోపణలు అటు బిఆర్ఎస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మించాలో అన్న సందిగ్ధ పరిస్థితిలోకి పార్టీ నాయకులు, క్యాడర్ వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందుకే పార్టీ పై స్థాయి నాయకత్వం ఖచ్చితంగా ఈ ఆరోపణల పై అనుమానాలను నివృత్తి చెయ్యాలి.
అయితే హరీష్ ప్రస్తుతం వ్యక్తిగత పర్యటనలో భాగంగా విదేశాలలో ఉన్నారు, ఈ ఆరోపణల పై ఆయన ఎలా స్పందిస్తారు అన్నదాని పై కూడా బిఆర్ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక గతంలో మాదిరి కేసీఆర్, కేటీఆర్ ఈ విషయంలో మౌనంగా ఉన్నా, సోషల్ మీడియా వేదికగా స్పందించినా అందుకు పార్టీ కింద స్థాయి నేతలు కానీ పార్టీ క్యాడర్ కానీ తృప్తి చెందరు. కాబట్టి “రేవంత్ – హరీష్ ల కలయిక, కవిత – బిఆర్ఎస్ చీలిక” అంశం మీద బిఆర్ఎస్ అధినాయకత్వం ఎంత తొందరగా స్పందిస్తే పార్టీకి అంత మేలు.




