తెలంగాణకి మేము చాలు… సినిమావాళ్ళని రానీయొద్దు: కవిత

Kavitha criticises Jana Sena in Telangana

నేడు హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగబోతోంది. టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన ఊహించినట్లే ఉంది.

ఆమె తన కార్యాలయంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ, “ఈ సినిమావాళ్ళ మాయలో మనం చిక్కుకోవద్దు. వీళ్ళు ఇక్కడ తెలంగాణలో ఒకలాగ మాట్లాడుతారు. ఆంధ్రా తిరిగి వెళ్ళి అక్కడ వేరేలా మాట్లాడుతారు. తమిళనాడు వెళ్ళి తమిళంలో మాట్లాడుతారు. ఢిల్లీ వెళ్ళి మమ్మల్ని తెలంగాణలో అడుగుపెట్టనీయడం లేదంటూ ఇంగ్లీషులో మాట్లాడుతారు.

ADVERTISEMENT

వీళ్ళ మాయలో చిక్కుకొంటే మనమే నష్టపోతాము. కనుక వీళ్ళ ఉద్దేశ్యాలు అర్థం చేసుకొని దూరంగా బెట్టాలి. ముఖ్యంగా యువత వీళ్ళ డిజైన్ అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ సినిమాలు నచ్చితే చూడండి. డాన్సులు నచ్చితే ఈలలు వేసి మీరూ డాన్సులు చేయండి. అంతవరకే తప్ప మన రాష్ట్రంలో వాళ్ళకు చోటు ఇవ్వకూడదు. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే వాళ్ళు పార్టీలు పెట్టుకొని తలక్రిందులుగా తపస్సు చేసినా మనకేమీ ఇబ్బంది ఉండదు.

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేమున్నాము. తెలంగాణ కోసం అవసరమైతే మా ప్రాణాలైనా పణంగా పెట్టడానికి మేము సిద్ధం,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.

‘ఎప్పటికైనా తెలంగాణ సిఎం కావాలన్నదే తన కోరిక’ అని ఇదివరకు చెప్పిన కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్‌ పార్టీ పెట్టిన తర్వాత ‘నేను తెలంగాణ సిఎం అవుతాను. ఓ తల్లిలా రాష్ట్రాన్ని పాలిస్తాను,” అని స్పష్టంగా తన మనసులో కోరికని బయటపెట్టారు.

తండ్రి పదేళ్ళ పాలనలో తనకు మంత్రి పదవి, అధికారం దక్కనందున అన్యాయం జరిగిందని కల్వకుంట్ల కవిత ఆవేదన చెందడం సహజమే. కనుక ఈసారి టీఆర్ఎస్‌ పార్టీతో తన కల నెరవేర్చుకోవాలని ఆమె ఆరాటపడుతున్నారు.

ఏపీలో జనసేనని అధికారంలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్‌ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసుకుంటే, ఆమె కల నెరవేర్చుకోవడం మరింత కష్టమవుతుంది.

పైగా వచ్చే ఎన్నికలలో ఆమె ఒంటరిగా అధికార కాంగ్రెస్‌ పార్టీని, తన తండ్రి కేసీఆర్‌ని, ఆయన పేరు చెప్పుకుంటూ సిఎం అవ్వాలని ఆశపడుతున్న అన్న కేటీఆర్‌ని బీఆర్ఎస్‌ పార్టీని ఒంటరిగా ఎదుర్కోవలసి ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ తర్వాత బిజేపి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అని ప్రధాని మోడీ చెప్పారు. బిజేపి, జనసేనలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోడీ సంకేతం ఇచ్చి వెళ్ళారు. కనుక జనసేనని చూసి కల్వకుంట్ల కవిత ఆందోళన చెందడం సహజమే.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలొడ్డి కాపాడుకుంటామని కల్వకుంట్ల కవిత చెప్తున్నారు. కానీ పదేళ్ళ బీఆర్ఎస్‌ పాలనలో కల్వకుంట్ల కుటుంబంలో ఆమెతో సహా అందరూ కోట్లకు పడగలెత్తిన విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి మాత్రం మారలేదని ఆమె స్వయంగా చెప్పుకుంటున్నారు కదా? మరి బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీలని దేనికి ప్రజలు ఆదరించాలి?

ADVERTISEMENT
Latest Stories